గంప లాభం ...చిల్లు తీస్తుందా?
మూడో ఫ్రంట్ ముచ్చట మరో 15,20 రోజుల్లో తేలిపోనుంది. బీజేపీ, కాంగ్రెసులకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ దిశలో గత కొంతకాలంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈ ప్రక్రియలో చిత్తశుద్ధిపై అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. కానీ స్థిరమైన వాదన, సిద్దాంతంతో కేసీఆర్ బలంగానే తన వాణిని ప్రతిధ్వనింపచేస్తున్నారు. జాతీయ స్థాయిలో తనకు బలమైన మద్దతు లభిస్తోందని కూడా చెబుతున్నారు. కానీ ఇంతవరకూ లభించిన స్పందనను బట్టి చూస్తే కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ మాత్రమే ఈ ఫ్రంట్ పై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. దీనికి అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. కన్నడనాట తెలుగు వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పాత హైదరాబాదు- కర్ణాటక ప్రాంతంలో ఓట్లను రాబట్టుకోవాలంటే తెలంగాణ సీఎం ప్రచారం ఉపకరిస్తుందనే భావన మాజీ ప్రధాని దేవెగౌడలో ఉంది. అందుకే పశ్చిమబంగలో మమత, ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ లు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ దేవెగౌడ, కుమారస్వామి మాత్రం రాజకీయపర్యవసనాలను దృష్టిలో పెట్టుకుని సై అన్నారు. అయితే అది మూన్నాళ్ల ముచ్చటగా మిగులుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో జేడీఎస్ కింగ్ మేకర్ గా అవతరిస్తే అంతటితో ఫ్రంట్ కు చెల్లు చీటి పలికేసినట్లే అవుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెసులో కసి....
కేసీఆర్ ప్రంట్ పై ఎక్కువగా ఆందోళన చెందుతున్న పార్టీ కాంగ్రెసు మాత్రమే. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి . బీజేపీ, కాంగ్రెసేతర కూటమి అంటూ కేసీఆర్ లేవనెత్తుతున్న నినాదం తమ కొంప ముంచేలా ఉందని కాంగ్రెసు అగ్రనాయకులు బెంబేలెత్తుతున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న కర్ణాటక ఎన్నికల్లో నలభై నుంచి యాభై నియోజకవర్గాలను ప్రభావితం చేయగల సంఖ్యలో తెలుగు ఓటర్లున్నారు. వీరిపై కేసీఆర్ ప్రభావం పడితే అసలే టఫ్ ఫైట్ లో ఫలితాలు తారుమారు కావచ్చనేది కాంగ్రెసు నేతల ఆందోళన. తెలంగాణ సీఎం తాను ప్రచారం చేయడమే కాకుండా ఎంఐఎం ను కూడా జేడీఎస్ కు మద్దతు పలికేలా చేయగలిగారు. మైనారిటీ ఓట్లు, తెలుగు ఓట్లు కలిస్తే బలమైన ఓటు బ్యాంకే ఏర్పడుతుంది. బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీ, తెలుగు ఓట్లు ఈసారి కాంగ్రెసు వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ముందుగా ప్రచారం సాగింది. దానికి గండి కొడుతూ జేడీఎస్ వైపు ఆకర్షితులైతే కాంగ్రెసు పార్టీకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అందుకే రాహుల్ గాంధీ సైతం స్పందించాల్సి వచ్చింది. కేసీఆర్ మోడీ ఏజంటు అంటూ ముందస్తు విమర్శలు గుప్పించారు. తమపార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి బీజేపీ వ్యతిరేక ఓటు జేడీఎస్ వైపు ఆకర్షితం కాకుండా చూడటానికి కాంగ్రెసు తంటాలు పడుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం తమకు బాగా కలిసొస్తుందని సంబరపడుతున్న సమయంలో గంపలాభం చిల్లుతీసిందన్నట్లుగా కేసీఆర్ ఫ్రంట్ గొడవ కొత్తగామొదలైంది. ఇంకా దీనిపై పెద్దగా కర్ణాటకలో చర్చ మొదలు కాకపోయినప్పటికీ ఒకసారి కేసీఆర్ ప్రచార రంగంలోకి దిగితే కచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది.
కమలంలో ఖుషీ....
కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టుగా బీజేపీ వ్యతిరేక ఓటును ఏరకంగా చీల్చాలా? అని కిందుమీదులవుతున్న కమలనాథులకు కేసీఆర్ వరంగా పరిణమించారు. ప్రధాని మోడీ మీద ఘాటు విమర్శలు చేస్తున్నప్పటికీ తమకు తెలంగాణలో పెద్దగా స్టేక్స్ లేవు కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అవే విమర్శలు కర్ణాటకలో సంధిస్తే జేడీఎస్ లాభపడుతుంది. పరోక్షంగా కాంగ్రెసు బలహీనపడుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న తాము అవసరాన్ని బట్టి జేడీఎస్ ను బుట్టలో వేసుకోవడం పెద్దపనేం కాదనే యోచనలో ఉన్నారు కమలం పార్టీ వారు. లింగాయత్ నాయకుడిని సీఎం రేసులో తాము ముందు పెడితే, లింగాయత్ ప్రత్యేక మత వాదాన్ని కాంగ్రెసు కౌంటర్ గా ప్రయోగించడంపై బీజేపీలో తర్జనభర్జనలు సాగుతున్నాయి. 17 శాతం వరకూ ఓటు బ్యాంకు ఉన్న లింగాయత్ వర్గం చీలిపోయి కాంగ్రెసుకు చేరువైతే కష్టాలు తప్పకపోవచ్చనే భావన ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందనే ఆశాభావమూ ఉంది. అయితే పట్టణ ఓటర్లలో విద్యాధికులు, మధ్యతరగతి క్రమేపీ కమలానికి దూరమవుతున్నారనే అంచనాలు వెలువడుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత నగదు మారక పరిస్థితి ఇంతవరకూ యథాపూర్వ స్థితికి రాకపోవడమూ కేంద్రానికి ఆందోళనకారకమే. వీటన్నిటికీ మూడో ఫ్రంట్ కు ముందస్తు ముచ్చటగా జేడీఎస్ బలపడితే సమాధానం దొరికినట్లవుతుందనుకుంటున్నారు. జేడీఎస్, కాంగ్రెసు పోటాపోటీగా ఉండి బీజేపీ మూడో స్థానంలో ఉన్న స్థానాల్లో తమ ఓట్లను కూడా వ్యూహాత్మకంగా జేడీఎస్ వైపు మళ్లించే ఎత్తుగడలనూ కమలం పార్టీ అనుసరించవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దక్షిణభారతంలో కమలానికి గేట్ వే గా చెప్పుకుంటున్న కర్ణాటక ఈసారి ప్రచారహోరుతో జోరందుకుంటోంది.
తారలు దిగివచ్చిన వేళ...
ఈసారి కర్ణాటక ఎన్నికలకు తెలుగు తారలు తళుకులద్దబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జెడీఎస్ కు తనవంతు సహకారం అందిస్తారంటున్నారు. మరోవైపు సాయికుమార్ బీజేపీ తరఫున రంగప్రవేశం చేసేశారు. చిరంజీవిని రంగంలోకి దింపాలని కాంగ్రెసు యత్నిస్తోంది. షెడ్యూలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక కన్నడ తారల హడావిడి సరేసరి. మొత్తమ్మీద వీళ్లందరి కంటే పొలిటికల్ స్టార్ కేసీఆర్ సృష్టించే హంగామాపైనే ఎక్కువ ఆసక్తి వ్యక్తమవుతోంది. ఉర్దూ, తెలుగు భాషల్లో అనర్గళంగా ప్రసంగించగల తెలంగాణ సీఎం ఉత్తర కర్ణాటకను ఊపేస్తారని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అయితే ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అంటూ అందుకోసమే తాను జేడీఎస్ కు మద్దతిస్తున్నట్లుగా కేసీఆర్ చెబుతున్నారు. ఫలితాలు వికటించి తన అవసరాల కోసం జేడీఎస్ బీజేపీ, కాంగ్రెసులలో ఏ పార్టీతో జట్టుకట్టినా మూడో ఫ్రంట్ ముచ్చట ముగిసిపోతుంది. ఇకపై ఆ దిశలో ఒక్క అడుగూ ముందుకు పడటం కష్టం. ఫెడరల్ కూటమి నినాదం ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది. 2019లో ఈ ఫ్రంట్ ఆచరణాత్మకమవుతుందన్న ఆశలూ సన్నగిల్లిపోతాయి.
-ఎడిటోరియల్ డెస్క్