అడుసు తొక్కనేల.....?
పూర్వీకులు ఊరకనే చెప్పలేదు. మన రాజకీయ నాయకులు చేసే వివిధ రకాల విన్యాసాలు బురదను తొక్కి కాలు కడుక్కుంటున్నట్లే ఉంటాయి. వాణిజ్య ప్రకటనల నిలిపివేత, వాటి జారీలో ఔదార్యం, దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి నియంత్రించడం వంటి అనేక మార్గాల్లో ఇప్పటికే ప్రసార, ప్రచురణమాధ్యమాలు సర్కారుల ఉక్కు కౌగిలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య ప్రయోజనం, జాతీయ దృక్పథం వంటివి దగా పడుతున్నాయి. సామ దాన భేద దండోపాయాలతో మీడియా సంస్థలను కనుసన్నల్లో ఉంచుకుంటున్న కేంద్రప్రభుత్వం ఇంకా ఏదో చేయాలని గిరిగీయాలని ప్రయత్నించి భంగపడటం తాజా ఘట్టం. తప్పుడు వార్తలతో మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది కాబట్టి ఫేక్ న్యూస్ భరతం పట్టాలని ఒక మార్గదర్శక సూత్రావళిని సమాచార ప్రసార శాఖ విడుదల చేసింది. వెంటనే ఉపసంహరించుకుంది. అమల్లోకి రాకపోయినప్పటికీ మీడియా పీక నొక్కేయాలనుకున్న ప్రభుత్వ ఉద్దేశం మాత్రం బట్టబయలైంది. ఎన్నికలకు ఏడాది ముందు చేయాలనుకున్న ఈ నిర్ణయం వెనక ఎంతో తతంగం చోటు చేసుకుంది. ప్రధాని సానుకూలతతోనే ఈ నిబంధనావళి బయటికి వచ్చినప్పటికీ తీవ్రస్థాయి వ్యతిరేకతతో ఆయనే మళ్లీ రంగంలోకి దిగి మంత్రిత్వ శాఖను మందలించి తన ఔదార్యాన్ని, భావ ప్రకటన ప్రియత్వాన్ని చాటుకున్నారు.
అసలు ఉద్దేశం...
దేశంలోని అరవై నుంచి డెబ్భై శాతం మీడియా సంస్థలు అధికార పార్టీలకు బాకాలుగా మారిపోయాయి. జాతీయ మీడియాలో వేళ్లమీద లెక్కించదగిన సంస్థలు మాత్రమే పాత్రికేయ ప్రమాణాలను పాటిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లాలంటే సాహసించలేకపోతున్నాయి. అయినప్పటికీ సర్కారుకు వ్యతిరేకంగా కొన్ని మీడియా హౌస్ లు వాస్తవాల అన్వేషణ కొనసాగిస్తున్నాయి. ఏలినవారికి ఇదే కంటగింపుగా మారింది. తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టుల గుర్తింపు రద్దు చేసేయాలని హఠాత్తుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎన్నికలకు ఏడాది వ్యవధి మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ప్రజావ్యతిరేకతను తమ సర్క్యులేషన్ గా, టెలివిజన్ రేటింగు పాయింట్లుగా మార్చుకునేందుకు మీడియా ప్రయత్నిస్తుంది. సర్కారు పట్టు కొంతమేరకు సడలుతుంది. దీనిని ఆసరా చేసుకుని మీడియా విజృంభిస్తుంది. దీనిని కనిపెట్టే వ్యక్తిగతంగా జర్నలిస్టులను భయకంపితులను చేసే ఎత్తుగడకు తెర తీశారు. జర్నలిస్టుగా గుర్తింపు రద్దు అంటే అపరాధభావన వెంటాడుతుంది. అందుకే ఏ ఒక్కరూ సాహసం చేయని పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి జర్నలిస్టులు రాస్తున్న అన్నివార్తలకూ నూటికి నూరుపాళ్లు ఆధారాలు ఉండవు. జరుగుతున్న తీరుపై బాధితులు, లేదా ఆయా సంస్థల్లో పని చేస్తున్న విజిల్ బ్లోయర్స్ అందించే సమాచారమే ప్రాతిపదికగా ఉంటుంది. అంకెల్లో కొంచెం అటుఇటు తేడాలు కూడా ఉంటాయి. జరుగుతున్న విషయాన్ని చాటిచెప్పడానికి మాత్రమే వార్తలు పనికొస్తాయి. అవినీతి, అక్రమాలు, లోపాలను వెలికి తీయాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలది. అందుకు అవసరమైన వాసన పసిగట్టే వాచ్ డాగ్ పాత్రను మాత్రమే మీడియా పోషిస్తుంది. ఈ రెంటి మధ్య ఉండే రేఖను చెరిపేసి మీ దగ్గర ఆధారాలు ఉంటే మాత్రమే వార్త రాయండి. తేడా వస్తే తోలు తీస్తామన్నట్లుగా జర్నలిస్టులను భయపెట్టాలని చూసింది మోడీ సర్కారు. చివరికి తీవ్రస్థాయి నిరసనలతో తోకముడవాల్సి వచ్చింది.
ఆది నుంచి అదే పంథా...
బ్రిటిషు సర్కారు సమయంలోనే మీడియాపై నియంత్రణ మొదలైంది. మాకొద్దీ తెల్లదొరతనం అన్నందుకు గరిమెళ్ల సత్యనారాయణ వంటివారు జైళ్లపాలు కావాల్సి వచ్చింది. స్వాతంత్ర్యానంతరమూ పాలకులు మారారు తప్పితే ప్రభుత్వ తీరు మారలేదు. ముఖ్యంగా 1975-77 లలో అత్యవసర పరిస్థితులలో మీడియాపై కొనసాగిన నిషేధం, నియంత్రణ, వార్తల సెన్సార్ షిప్ భారత పత్రికా ప్రపంచంలోనే చీకటి రోజులను పట్టి చూపింది. ప్రధాని ఇందిర వ్యవహారశైలి అంతర్జాతీయంగా కూడా విమర్శలకు తావిచ్చింది. 1988 ప్రాంతంలో రాజీవ్ గాంధీ కూడా పరువు నష్టం పేరిట మీడియా స్వేచ్చను కఠినంగా అణిచివేసేందుకు చట్టం చేయాలనుకున్నారు. సంఘటితంగా మీడియా దీనిని ప్రతిఘటించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దానిని ఉపసంహరించకున్నారు. అప్రతిహతమైన అధికారాలను అనుభవిస్తూ విమర్శలను తట్టుకోలేనివారే ఎక్కువగా మీడియాను నియంత్రించాలని చూస్తుంటారు. అప్పట్లో బోఫోర్సు ఇతరవిషయాల్లో పుంఖానుపుంఖాలుగా వస్తున్న కథనాల తీవ్రతను తట్టుకోలేక రాజీవ్ గాంధీ కట్టడి చేయాలని చూశారు. తాజాగా నరేంద్రమోడీ ప్రభుత్వమూ ఫేక్ న్యూస్ ను అరికడతామంటూ రంగంలోకి దిగింది. ఏది తప్పుడు వార్త? అంటే సమాధానం దొరకదు. వంద వార్తలు రాసిన ఒక విలేఖరి తొంభై ఎనిమిది వార్తలు సరైనవి రాసి, ఒకటి రెండు వార్తలు కొంచెం తేడాగా రాస్తే అతను ఫేక్ జర్నలిస్టు జాబితాలో చేరిపోవాల్సిందే. ఇటువంటి నియంతృత్వ పోకడలు ప్రజాస్వామ్యానికి చేటు చేస్తాయి. వార్తలు తప్పురాస్తే ఖండనలు, వివరణలు, న్యాయపరమైన చర్యలకు రకరకాల మార్గాలున్నాయి. కానీ ఆ జర్నలిస్టు ఇంటిగ్రిటీనే దెబ్బతీసేలా గుర్తింపు రద్దు చేయాలన్న ఆలోచనే దురహంకార పూరితం. సాధారణంగా నాయకులు మీడియా కారణంగా తాము రాజకీయంగా నష్టపోతామని కచ్చితంగా గ్రహించిన సందర్బాల్లోనే ఇటువంటి చర్యలకు పూనుకుంటూ ఉంటారు. ఇందిర, రాజీవ్ ల కాలంలో అదే జరిగింది. మోడీ ప్రభుత్వానికి కూడా అటువంటి సంకేతాలు అందుతున్నాయేమోననిపిస్తోంది. నిజానికి ఆ భయమే ఇటువంటి ముందుజాగ్రత్త చర్యలకు కారణమై ఉండవచ్చు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియామకాల్లో సైతం ఎడిటర్స్ గిల్డ్ వంటివాటిని పక్కన పెట్టి సొంతంగా కొన్ని నియామకాలు చేయడం పెత్తనానికి ఒక అడ్డదారిని వెదుక్కున్నట్లే. సర్కారీ నియంత్రణ యత్నం ఇది మొదటిదీ కాదు, చివరిదీ కాదు, ఇది నిరంతర పోరాటం. క్యాట్ అండ్ మౌస్ గేమ్. సంఘటితంగా నిలవడం ద్వారానే ప్రసార,ప్రచురణమాధ్యమాలు తమ భావప్రకటన స్వేచ్ఛను, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించుకోగలుగుతాయి.
-ఎడిటోరియల్ డెస్క్