నూటికో..కోటికో..ఒక్కడు..!
చరిత్రలో కొందరే మహానుభావులుంటారు. వారిలో ఒకరు ఎన్టీరామారావు. ఒక కులం వాళ్లు అతనిని తమ వాడే అని గర్వంగా చెప్పుకోవచ్చు. తమ జాతిని అధికారంలోకి తెచ్చారని చాటిచెప్పుకోవచ్చు. కానీ కులమతాలకు అతీతంగా అందరూ సొంతం చేసుకున్న తెలుగోడు. వెండితెర జిలుగు. రాజకీయవెలుగు. ఇంటింట్లో ఎన్టీవోడు. తెలుగుదేశాన్ని ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చిన నాయకుడు. ఇప్పుడు పొలిటికల్ పోస్టర్ గా మారిపోయాడు. ఒకానొక దశలో ఆయనను మరిపించేయాలని చూశారు కొందరు తెలుగుదేశం నాయకులు. ఇప్పుడు మళ్లీ ఆయన నామజపాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార పరమపదసోపాన పటంలో ఆయనే తారకమంత్రంగా భావిస్తున్నారు. జనతా ప్రయోగం తర్వాత కాంగ్రెసు పార్టీ మినహా దేశానికి దిక్కులేదనుకుంటున్న స్థితిలో అనేక పక్షాలు నేషనల్ ఫ్రంట్ గా ఒకేతాటిపైకి రావడానికి ప్రేరణగా నిలిచింది ఎన్టీయార్. సారథ్యం వహించిందీ ఆయనే. జాతీయస్థాయిలో సంకీర్ణ ప్రయోగాలు మొదలై కొనసాగుతూ రావడానికి అప్పుడే పునాది పడింది. జనతాప్రయోగంలో అన్ని పక్షాలు కలిసి పోరాడాయి. కానీ నేషనల్ ఫ్రంట్ నుంచే విడివిడిగా ఉంటూనే ఐక్యతారాగం పలికే రాజకీయ అవగాహన మొదలైంది. తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే భిన్నత్వంలో ఏకత్వమనే భారత అఖండతా సూత్రం రాజకీయాల్లోనూ విజయవిహారం చేయడం ప్రారంభమైంది.
ఆశ..ఆశయం...
వందల సంఖ్యలో పౌరాణిక పాత్రలు పోషించిన ఆస్తికుడు ఎన్టీరామారావు. అటువంటి వ్యక్తి సోషలిజం, కమ్యూనిజాల కలయికగా తన రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం అరుదైన ఘట్టం. ‘సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లు.’ అంటూ అన్న ఎత్తుకున్న నినాదం ఆధునిక లౌకిక వాదానికి నిర్వచనం. ఆధ్యాత్మిక భావజాలాన్ని జనంతో అనుసంధానించిన ఔన్నత్యం. రైతులకు చౌక విద్యుత్తు, సంక్షేమ బియ్యం, మధ్యాహ్న భోజనం వంటి వన్నీ ఆనాటి సమాజంలో పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేసినవే. నిజానికి ఆరోజుల్లో ప్రభుత్వాలు కూడా పేదవే. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్టులు లేవు. విదేశీరుణసాయాలు, తిమ్మినిబమ్మిని చేసే అప్పుల ప్రాజెక్టులు లేవు. అంతంతమాత్రం వనరులతోనే అన్ని పథకాలను అమలు చేయగలిగారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచడానికి ప్రయత్నించారు. టీచర్ల ట్యూషన్లు, డాక్టర్ల ప్రయివేటు ప్రాక్టీసులు కట్టడి చేయాలని తపించారు.విద్య,వైద్యం పేదలకు అందుబాటులో ఉండాలనేది ఆయన కన్న కల. ప్రజలకు పాలన చేరువ చేసే మండల వ్యవస్థ కూడా ఒక వినూత్నమైన ఆలోచన. పటేల్, పట్వారీ, కరణం, మునసబుల చేతిలో దశాబ్దాలుగా నలిగిపోతున్న గ్రామీణ ప్రజానీకం చెర విడిపించి కొత్త వ్యవస్థను పరిచయం చేశారు. పరిపాలన పరంగా దార్శనికతకు ఆయన చేసిన క్రుషి చాలా గొప్పది. కొండపై కొలువైన వెంకటేశ్వరుని నిధులతో విద్య, వైద్య సదుపాయాలను తిరుపతిలో నెలకొల్పారు. నిత్యాన్నదాన పథకంతో వెంకటేశ్వరుని వైభవాన్ని కూడా పెంచారు.
ఆవేదన..ఆక్రోశం...
నిజానికి ఈ రోజున ఎన్టీయార్ పట్ల అచంచల భక్తి ప్రపత్తులు ప్రకటిస్తున్న టీడీపీ నాయకులే ఆయనకు ద్రోహం చేశారని చెప్పాలి. ఆయనను అధికారంలోంచి దింపడం ఒక రాజకీయ అవసరంగా భావించారు. వెన్నుపోటు అని ప్రత్యర్థులు ఆరోపించినా ప్రజాస్వామ్యయుతంగా జరిగింది కాబట్టి చట్టప్రకారం దానిని ఎవరూ తప్పుపట్టలేరు. నైతికంగా నమ్మకద్రోహంగానే చెప్పాలి. కానీ ఎన్టీయార్ ను పదవీ చ్యుతుడిని చేసిన తర్వాత ఆయన ఘనతను కుదించివేయడానికి టీడీపీ నేతలు శాయశక్తులా ప్రయత్నించారు. అదే ఆయనను బతికుండగానే కుంగదీసింది. ఎన్టీయార్ మరణం తర్వాత 1996 నుంచి 2004 వరకూ ఎనిమిదేళ్ల పాటు టీడీపీ కేంద్రంలో చక్రం తిప్పింది. రామారావు తెలుగు జాతికి, భారత ప్రజాస్వామ్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత రత్న ఇవ్వడం సముచితమని వాజపేయి వంటివారు భావించినా టీడీపీ అగ్రనేతలే అడ్డుపడ్డారనేది విమర్శ. అవార్డు ప్రకటిస్తే సంప్రదాయం ప్రకారం భార్య లక్ష్మీపార్వతి దానిని స్వీకరించాల్సి ఉంటుంది. లక్ష్మీపార్వతి పొడగిట్టని చంద్రబాబు నాయుడు ఇదిసహించలేకనే ఎన్టీయార్ కుదక్కాల్సిన కీర్తి కిరీటాన్ని తోసిపుచ్చారంటారు . ఎంజీఆర్ వంటివారికి భారత రత్న విషయంలో తమిళనాడు విజయం సాధించింది. అంతకంటే జాతీయంగా గొప్ప పేరు ప్రఖ్యాతులతోపాటు తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిపెట్టిన ఎన్టీయార్ కు భారతరత్న రాకపోవడానికి రాజకీయాలే అడ్డంకిగా నిలిచాయి.నేటికీ ఆయన అభిమానులను వేధించే ఆవేదన అదే.
కీర్తి..స్ఫూర్తి....
బడుగుబలహీన వర్గాలు, ముఖ్యంగా వెనకబడిన తరగతులు రాజకీయంగా ముందంజ వేయడంలో ఎన్టీయార్ పోషించిన పాత్ర అనిర్వచనీయం. మహిళలకు ఆస్తి హక్కులో వాటా, రిజర్వేషన్ల వంటి అంశాలకు శ్రీకారం చుట్టారు. ఒక కొత్త తరాన్ని రాజకీయాలలో ప్రవేశపెట్టారు. ఇప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ లో, ఇటు తెలంగాణలో కీలక పాత్రలు పోషిస్తున్న నేతల్లో మెజార్టీ నాయకులు రామారావు ఆదరణతో గుర్తింపు పొందినవారే. నిజానికి వారసత్వ రాజకీయాలను ఎన్టీరామారావు ప్రోత్సహించలేదు. అప్పటికే రాజకీయాల్లో ఉన్న అల్లుళ్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారు ఎన్టీయార్ బలహీనతను తమ పెట్టుబడిగా మార్చుకున్నారు. గ్రూపులను నెలకొల్పి పార్టీని తమ గుప్పెట్లోకి తెచ్చుకోగలిగారు. పదవి పోయిన తర్వాత మరునాటికే నాయకులు మరుగున పడిపోతున్నారు. రెండు దశాబ్దాల క్రితమే మరణించినా ఈనాటికీ ఉజ్వల రాజకీయ తారగా వెలుగొందడమే ఎన్టీయార్ కీర్తి ప్రతిష్టలకు నిదర్శనం. అధికార తెలుగుదేశమే కాదు, అటు వైసీపీ, బీజేపీ, కాంగ్రెసు , జనసేన వంటి పార్టీలన్నీ మచ్చలేని నాయకునిగా తెలుగు జాతి కోసం అంకితమైన మహోన్నత వ్యక్తిగా భావించడమే ఆయన స్ఫూర్తి చంద్రిక.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- andhra pradesh
- ap politics
- bharatha rathna
- bharathiya janatha pary
- chief minister
- indian national congress
- nara chandrababu naidu
- nt ramarao
- telugudeam party
- vajpayee
- ఆంధ్రప్రదేశ్
- ఎన్టీ రామారావు
- ఏపీ పాలిటిక్స్
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబు నాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్
- భారత రత్న
- భారతీయ జనతా పార్టీ
- ముఖ్యమంత్రి
- వాజపేయి