రజిత్ ‘‘రేఖ’’ దాటారో.....!
ప్రజాస్వామ్య ప్రక్రియకు ఎన్నికలు ప్రాణాధారం వంటివి. అటువంటి కీలకమైన ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములాంటిది. ఇందుకోసమే నాడు మన రాజ్యాంగ నిర్మాతలు స్వతంత్ర ఎన్నికల సంఘం ఆవశ్యకతను గుర్తించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, నిర్భయంగా నిర్వహించాలంటే దానికి స్వతంత్ర ప్రతిపత్తి అవసరం. దానిపై ప్రభుత్వ పెత్తనాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాని అనుబంధ సంస్థలే రాష్ట్ర ఎన్నికల సంఘాలు. వీటికి సీనియర్ ఐఏఎస్ లు సారథులుగా ఉంటారు. ఎన్నికల ప్రక్రియకకు ముందు ప్రారంభమై..ముగిసేంత వరకూ ఈసీ నిత్యం వార్తల్లో నలుగుతుంటోంది. దాని సారథిపైనే అందరి దృష్టి ఉంటుంది. 90వ దశకంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా టీఎన్ శేషన్, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా నాటి చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ డాక్టర్ ఇలపావులూరి వెంటక సుబ్బారావు తమ నిష్పక్షపాత వైఖరితో ఓటర్ల మన్ననలను అందుకున్నారు.
వివిధ పదవులను నిర్వహించి.......
తాజాగా తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ రజిత్ కుమార్ తెరపైకి వచ్చారు. నిన్న మొన్నటి వరకూ ఆయన ఎవరో చాలా మందికి తెలియదు. కానీ ఒకసారి అసెంబ్లీ రద్దవడంతో డాక్టర్ రజిత్ కుమార్ పేరు వెలుగులోకి వచ్చింది. అందరి దృష్టి ఆయన పైకి మళ్లింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల సీఈవోగా భన్వర్ లాల్ ఉండేవారు. ఆయన పదవీ విరమణతో ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల్లో కొత్తగా ఆవిర్భవించింది. తెలంగాణ సీఈవోగా డాక్టర్ రజిత్ కుమార్ నియమితులయ్యారు. సీఈవోగా రాకముందు ఆయన రాష్ట్ర అటవీ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ గ్యాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా, ఏపీ ఇండ్రస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ గా , ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ డైరెక్టర్ గా పనిచేశారు. కీలకమైన పరిశ్రమల శాఖ, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా వ్యవహరించారు. సీఈవో గా వ్యవహరించారు. సీఈవో పదవికి రాష్ట్ర ప్రభుత్వం రజిత్ కుమార్ తో పాటు , సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, శశాంక్ గోయల్ పేర్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. వీరిలో రజిత్ కుమార్ ను ఈసీ ఎంపిక చేసింది. తటస్థుడు, నిర్భయంగా, నిష్పక్ష పాతంగా వ్యవహరించగలరన్న విశ్వాసంతో ఈసీ ఆయనను ఎంచుకుంది. ఆంద్రప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ గా ఆర్.పి. సిసోడియాను నియమించింది.
మ్యానిఫేస్టో సయితం......
తాజాగా అసెంబ్లీ రద్దు అందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో రాష్ట్ర సీఈవో డాక్టర్ రజిత్ కుమార్ వార్తల్లోకి ఎక్కారు. నిత్యం సమీక్షలు, సమావేశాలు, ఎన్నికల ఏర్పాట్లు,కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు పంపడంలో ఆయన క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హాకు ఏర్పాట్లు, సన్నద్ధతపై సావధానంగా వివరించారు. అదే సమయంలో ప్రభుత్వం, పార్టీలకు లక్షణ రేఖలను గీశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీల్లేదని కొరడా ఝుళిపిస్తున్నారు. పార్టీలు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడానికి వీల్లేదని, వాటిపైన నిఘా పెడతామని డాక్టర్ రజిత్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల ప్రణాళికల ముసాయిదాను తమకు పంపాలని, తమ అనుమతి తర్వాతే వాటిని ప్రకటించాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు అనుమతి మేరకు ఎన్నికల ప్రణాళికకు అనుమతి అనివార్యమని వివరించారు. ఎన్నికల నిబంధనావళిలోని ఎనిమిదింటిలో ఏడు అంశాలు నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే అమల్లోకి వస్తాయని, నోటిఫికేషన్ వెలువడక ముందు ప్రకటించే ప్రణాళికతో సబంధం లేకపోయినా, వాటపైనాదృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ పరంగా ఆర్థిక అంశాలతో కూడిన నిర్ణయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ తీసుకోవాలని, తర్వాత వాటిని తమకు పంపితే తాము కేంద్ర ఎన్నికల కమిషన్ పుంపతామని ఆయన స్పష్టం చేశారు. వీటి ద్వారా ఎన్నికల సంఘం ఉత్సవ విగ్రహం కాదని, అలంకారప్రాయ సంస్థ కాదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు. తనను తేలిగ్గా తీసుకోవద్దన్న సంకేతాలను సైతం అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీలకూ పంపారు. ఎన్నికలయ్యేంత వరకూ తాను కీలకమని స్పష్టంగా తెలియజేశారు.
ఓటర్ల ను దృష్టిలోపెట్టుకుని......
మరోవైపు ఓటర్ల పరంగా పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నిష్పకష పాత ఎన్నికలు తన కర్తవ్యంగా చాటుకున్నారు. తాజాగా తాను వేసిన ఓటు తాను సూచించిన అభ్యర్థికే పడిందా? లేదా? అన్న విషయాన్ని తనిఖీ చేసే సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఓటువేసిన వెంటనే ఓటింగ్ యంత్రం నుంచి ఒక పత్రం వస్తుంది. దానిపై ఓటు సక్రమంగా పడిందా? లేదా? అన్న విషయం ఏడు సెకన్ల పాటు కన్పిస్తుంది. వేరే అభ్యర్థికి పొరాపాటున ఓటు పడిన పక్షంలో సంబంధిత పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. గతంలో మాదిరిగా ఎవరిని పడితే వారిని ఎన్నికల అధికారిగా పంపే పరిస్థితి లేదు. ఈసీ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే బాధ్యతలను అప్పగిస్తారు. ఇందుకోసం ఈ నెల 24 నుంచి ఎన్నికల అధికారులకు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే పోలింగ్ బాధ్యతలను వారికి అప్పగిస్తారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయంపై కూడా దృష్టి పెట్టనున్నారు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఇప్పటికే శిక్షణ ప్రారంభించడం విశేషం. అసత్యాలను ప్రసారం చేసే సామాజిక మాధ్యమాలపైన కూడా దృష్టి పెట్టారు. వీటిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. మొత్తం మీద రజిత్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఆషామాషీగా తీసుకోవడం లేదన్నది స్పష్టమవుతుంది. నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా వ్యవహరిస్తారన్న సంకేతాలు పంపుతున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల్లో ఎన్నికల సమయాల్లో తటస్థ ప్రభుత్వాలు అధికారంలో ఉంటాయి. మన దేశంలో అలాంటి వ్యవస్థ లేదు. ఎన్నికల సంఘాలే ఆ పాత్రను నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే వాటికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించింది.
-ఎడిటోరియల్ డెస్క్