‘సంక్షేమం’ సిద్ధూను గట్టెక్కిస్తుందా?
సిద్ధరామయ్య.... ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన నాయకుడు. పదవులను అందుకోవడం, వాటిని కాపాడుకోవడంలో అందెవేసిన చేయి. ఓటర్ల నాడిని పసిగట్టి అందుకు అనుగుణంగా పావులు కదపడంలో నిపుణుడు. అందుకే పెద్దగా ప్రజాబలం లేనప్పటికీ కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు. అయిదేళ్ల పదవీకాలాన్ని పూర్తిగా అనుభవించారు. ఒక్కలింగ, లింగాయత్ వంటి బలమైన సామాజిక వర్గాలకు తెలివిగా చెక్ పెట్టి అయిదు సంవత్సరాల పాటు చక్రం తిప్పగలుగుతారు. ఇప్పుడు మరోసారి అధికారాన్ని అందుకునేందుకు ముందస్తుగా ప్రణాళిక రచించారు. అదే సంక్షేమం. కేవలంల కుల, మత రాజకీయాలు, అభివృద్ధి పథకాలు మాత్రమే అధికారాన్ని సంపాదించి పెట్టలేవని ఆయన అంచనా వేసుకున్నారు. దీంతో పాటు సంక్షేమ పథకాల ఆవశ్యకతను గుర్తించారు. వివిధ వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా, వారి ఓట్లు రాబట్టుకునే లక్ష్యంతో పలు సంక్షేమ పథకాలను ముందు చూపుగా ప్రవేశపెట్టారు. అవి ఎంతవరకూ రేపటి ఎన్నికల్లో సిద్ధరామయ్యకు ఓట్ల రాల్చగలవన్నది ప్రస్తుతం వివిధ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎన్నో పథకాలు...ప్రజల సంతృప్తి......
సంక్షేమ పథకాల పేర్లు చెప్పగానే ఎన్టీఆర్, జయలలిత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి నాయకులు గుర్తుకు వస్తారు. తద్వారా వారు రాజకీయంగా లబ్దిపొందారు. ఇదే తరహాలో వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందుచూపుతో వ్యవహరించారు. 2013లో అధికారంలోకి వచ్చిన ఏడాది అనంతరం తొలుత అన్న భాగ్య పథకాన్ని ప్రారంభించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి రూపాయికి కిలోబియ్యం అందించడం ఈ పథకం ఉద్దేశ్యం. ఇది అద్భుతమైన పథకం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాఠశాలల నుంచి ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ ను నివారించే ఉద్దేశ్యంతో ‘సైకిల్ భాగ్య’ పథకాన్ని ప్రవేశపెట్టారు. 66 శాతం మంది ప్రజలు దీనిపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రసీ రిఫామ్స్ సర్వేలో వెల్లడయింది. వాన నీటిని సంరక్షించి సమర్థంగా వినియోగించడం ద్వారా వ్యవసాయ దిగుబడులను పెంచే లక్ష్యంతో ‘కృషి భాగ్య’ పథకాన్ని ప్రారంభించారు. 58 శాతం మంది ప్రజలు దీనిపై సంతృప్తి చెందుతున్నారు. నిరుపేదలకు ఎల్పీజీ గ్యాస్ కనెన్షన్లు ఉచితంగా అందించే ఉద్దేశ్యంతో ‘అనిల్ భాగ్య’ పథకాన్ని ప్రవేశపెట్టారు. 66 శాతం మంది ప్రజలు దీనిపై సంతృప్తి చెందుతున్నట్లు అంచనా. అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన నవదంపతలకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించే ‘షౌదీ భాగ్య’ పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. నిరుపేదలకు ఇది వరం లాంటిది. తమిళనాడులో దివంగత జయలలిత ప్రారంభించిన ‘అమ్మ క్యాంటిన్లు’ పథకానికి మారుపేరుగా ఇందిరమ్మ క్యాటిన్ల పథకాన్ని ప్రారంభించారు. చౌకధరలకు ఇక్కడ ఆహార పదార్థాలు అందిస్తున్నారు. పలువురు పేదలు దీనివల్ల లబ్ది పొందుతున్నారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు క్షీరభాగ్య, మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలన్న ధ్యేయంతో ప్రారంభంలో ఆరోగ్య భాగ్య పథకాలన ప్రజల ఆదరణను చూరగొన్నాయి. ‘క్షీరభాగ్య’ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఏమీ లేని వారు కూడా కేవలం రెక్కల కష్టాన్ని నమ్ముకుని నాలుగు రూపాయాలు వెనకేసుకుంటున్నారు.
ఓట్లను రాబడతాయా?
ఆరోగ్య భాగ్యం పథకం ద్వారా నిరుపేద వృద్ధులకు మేలిమి వైద్య సౌకర్యాలు లభిస్తున్నాయి. సంతానం పట్టించుకోనప్పటికీ, ప్రభుత్వపరమైన భరోసా లభిస్తుండటంతో వారి కళ్లలో ఆనందం కనపడుతోంది. పాఠశాలల నిర్వహణ, విద్యుత్తు సరఫరా, ప్రజా రవాణా, అవినీతి నిర్మూలన , సబ్సిడీ ధరలకు నిత్యావసర సరుకుల పంపిణీ, ఉద్యోగ అవకాశాల కల్పన తదితర రంగాల్లో ప్రభుత్వ పనితీరు బాగానే ఉందన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో వీటిని మరింత పకడ్బందీగా, సమర్థంగా నిర్వహించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక్కో హామీ, ఒక్కో వాగ్దానం ఒక్కోసారి ఓట్లను రాబట్టడంలో విజయవంతమవుతాయి. ఎన్టీఆర్ హయాంలో కిలో రెండు రూపాయల బియ్యం. జనతా వస్త్రాలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ వంటి పథకాలు ప్రజాదరణను పొందాయి. ప్రస్తుతం కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ రకాల సంక్షేమ పథకాలపై విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్, ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లేనప్పటికీ వేల కోట్ల రూపాయలతో పథకాలను ప్రారంభిస్తుండటం విశేషం. ఎన్ని పథకాలు ప్రారంభించినా వాటిని సమర్థంగా, సక్రమంగా అమలు చేయనట్లయితే ఆశించిన ఫలితం రావడం కష్టమే మరి....!
-ఎడిటోరియల్ డెస్క్