బాదామిలోనూ సిద్దూ అష్టకష్టాలే...!
బాగల్ కోట్ జిల్లాలోని బాదామి ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. నిన్న మొన్నటి దాకా ఈ నియోజకవర్గం గురించి రాష్ట్రంలోనే చాలామందికి తెలియదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ప్రముఖంగా నిలిచింది. జాతీయ ప్రచార, ప్రసార మాధ్యమాల దృష్టి దీనిపై పడింది. సిద్ధరామయ్య తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గాన్ని కుమారుడు యతీంద్ర కోసం త్యాగం చేయడంతో పక్కనే గల పాతస్థానం చాముండేశ్వరి నుంచి పోటీకి దిగారు. ఇక్కడ నుంచి సిద్ధరామయ్య గతంలో అయిదుసార్లు గెలిచారు. మరో రెండుసార్లు ఓడిపోయారు. నియోజకవర్గాల పునర్విభజనతో సామాజిక వర్గాల ముఖచిత్రం మారడంతో అనంతర కాలంలో ఆయన పక్కనే ఉన్న వరుణకు మారారు. కుమారుడి రంగప్రవేశంతో ఒకింత అయిష్టంతోనే చాముండేశ్వరి నంుచి నామినేషన్ దాఖలు చేశారు. కాని మనసులో మాత్రం విజయావకాశాలపై శంక ఉంది. దీంతో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆలోచన చేశారు. ఇందుకు తొలుత అధిష్టానం అంగీకరించకపోవడంతో గట్టిగా వత్తిడి తెచ్చారు. ముఖ్యమంత్రి రెండు చోట్ల నుంచి పోటీ చేయడం ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుందన్న ఉద్దేశ్యంతో అధిష్టానం తాత్సారం చేసింది. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారని విపక్షాలు ప్రచారం చేస్తాయన్న అభిప్రాయంతో ఒకింత ఊగిసలాట ప్రదర్శించింది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఆ ప్రచారాన్ని ప్రారంభించాయి. అయినప్పటికీ సిద్ధరామయ్య గట్టిగా పట్టుబట్టడంతో అధిష్టానం సరేనంది.
కులాల వారీగా సమీకరణలు....
వాస్తవానికి బాదామి స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఏమీ కాదు. గతంలో గెలిచిన అభ్యర్థులు కూడా గొప్ప మెజారిటీతో సాధించలేదు. 1994,1999, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే హస్తం పార్టీ ఇక్కడ విజయపతాకం ఎగురవేసింది. 2004, 2008లో మాత్రం కమలనాధులు పాగా వేశారు. 2013లో కాంగ్రెస్ అభ్యర్థి చిమ్మనశెట్టి బయప్ప భీమప్ప విజయం సాధించారు. ఆయనకు 57446 ఓట్లు రాగా, ప్రత్యర్థి అయిన జనతాదళ్ (ఎస్) అభ్ర్థి మహంతేశ్ గురుపాదప్పకు 42,333 ఓట్లు లభించాయి. 200లో అయిదు వేలు, 2004లో దాదాపు 20వేల తేడాతో హస్తం పార్టీ బాదామిలో ఓటమి పాలయ్యింది. పార్టీకి ఏ రకంగానూ కంచుకోట కాదన్నవిషయం సుస్పష్టం. ఇవేమీ తెలియనంతటి అమాయకుడు ఏమీ కాదు సిద్ధరామయ్య. సామాజిక వర్గాల సమీకరణను దృష్టిలో పెట్టుకుని బరిలోకి దిగారు. ఇక్కడ వీరశైవ, లింగాయత్ ఓటర్లు సుమారు 65 వేల మంది ఉంటారని అంచనా. 48 వేల మంది కురబలు, 30 వేల మంది వాల్మీకీ, 30 వేల మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. ముస్లింలు 12 వేల మంది, పద్మశాలీలు 12 వేల మంది ఉన్నారు. ఈ అంకెలు, లెక్కలే తన బలమని సిద్ధరామయ్య నమ్మకం. సంప్రదాయ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుతో పాటు తన సామాజిక వర్గమైన 48 వేల మంది కురబలు అండగా ఉంటారన్నది ఆయన ధీమా. లింగాయత్ ల్లో సగం మంది ఓటేసినా గండం నుంచి గట్టెక్కుతానని భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు, ముస్లింల ఓట్లు తనకే పడతాయన్నది సిద్ధరామయ్య గట్టి విశ్వాసం. కుల సమీకరణలతో పాటు తన అయిదేళ్ల పాలన విజయానికి బాటలు వేస్తుందన్నది ఆయన నమ్మకం. లింగాయత్ లను అల్ప సంఖ్యాక వర్గాలుగా తమ ప్రభుత్వం గుర్తించడంతో కనీసం సగం మంది అయినా మద్దతు ఇస్తారని చెబుతున్నారు. సహజంగా లింగాయత్ లు బీజేపీకి అండగా ఉంటారు.
సిద్ధూను చావు దెబ్బ తీయాలని.....
సిద్ధరామయ్యను చావుదెబ్బ తీయాలన్న పట్టుదల అటు బీజేపీ, ఇటు జేడీఎస్ ల్లో వ్యక్తమవుతోంది. ఇందుకోసం రెండు పార్టీలు రహస్య అవగాహనకు వచ్చాయన్న వాదన ఉంది. ఉమ్మడి ప్రత్యర్థిని రాజకీయంగా దెబ్బతీయాలన్న ఆలోచనతో వ్యవహరిస్తున్నారు. 2004, 2008లో బాదామిలో కాషాయ పార్టీ విజయ పతాకాన్ని ఎగురవేసింది. తింగాయత్ లలో మెజారిటీ ప్రజలు తమకు అండగా ఉంటారని కాషాయ పార్టీ భావిస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల బాదామి సమీపంలోని శివయోగి మందిరంలో లింగాయత్ సామాజిక వర్గ ఓటర్లతో సమావేశమయ్యారు. బీసీల ఓట్లను రాబట్టుకునేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన బి.శ్రీరాములును బరిలోకి దించింది. ఈయనది వాల్మీకి సామాజిక వర్గం. జనతాదళ్ (ఎస్) కూడా తనదైన వ్యూహంతో ముందుకు వెళుతోంది. లింగాయత్ లు ఎక్కువ మంది ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన హనుమంతప్పను రంగంలోకి దించింది. గత నవంబరులోనే పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఆయన ప్రచారంలో ముందున్నారు. ఆయన రెడ్డి లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వరాు. పార్టీ పరంగా కూడా సిద్ధరామయ్యకు చిక్కులు లేకపోలేదు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత సతీష్ జార్జి హోళికి నియోజకవర్గంలో కొంతవరకూ పట్టుంది. గతంలో తనను మంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తొలగించారన్న అసంతృప్తి ఆయనలో ఉంది. ఈ నేపథ్యంలో సతీష్ ఎంతవరకూ చిత్తశుద్ధితో పనిచేస్తారన్నది ప్రశ్నార్థకమే. మొత్తం మీద చూస్తే బాదామిలో సిద్ధరామయ్య విజయం నల్లేరుపై నడక కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
-ఎడిటోరియల్ డెస్క్