జగన్ సర్కారుపై వ్యతిరేకత.. వైసీపీ నేతలే కారణమా?
గడిచిన వారం పది రోజులుగా రాష్ట్రంలో చాపకింద నీరులా వినిపిస్తున్న పదం వ్యతిరేకత. అది కూడా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని. దీంతో అసలు ఏం [more]
గడిచిన వారం పది రోజులుగా రాష్ట్రంలో చాపకింద నీరులా వినిపిస్తున్న పదం వ్యతిరేకత. అది కూడా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని. దీంతో అసలు ఏం [more]
గడిచిన వారం పది రోజులుగా రాష్ట్రంలో చాపకింద నీరులా వినిపిస్తున్న పదం వ్యతిరేకత. అది కూడా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని. దీంతో అసలు ఏం జరుగుతోంది? అనే విషయంపై నేరుగా సీఎంవోనే దృష్టి పెట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది గడిచిన దరిమిలా.. ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఈ ప్రచారం వెనుక ఎవరు ఉన్నారు? ఏం జరుగుతోంది? అనే విష యాలపై కూపీ లాగింది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు ప్రభుత్వానికి తెలిసాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ ప్రచారం వెనుక ఉన్నారని, గతంలో టీడీపీలో ఉన్న వీరు.. ఇప్పుడు ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యం దక్కలేదనే అక్కసుతో ఇలా ప్రచారం చేయిస్తున్నారని తెలిసింది.
హామీ ఇవ్వకపోయినా…..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో తమకు కూడా బెర్తులు లభిస్తాయని చాలా మంది నాయకులు ఎదురు చూశారు. వీరిలో వివిధ జిల్లాలకు చెందిన ఐదారుగురు మాజీ టీడీపీ నేతలు ఉన్నారు. శిల్పా చక్రపాణి, ఆనం రామనారాయణ వంటి వారు కూడా ఉన్నారు. అయితే, వీరికి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువగా అవకాశం ఇస్తే.. రెడ్డి రాజ్యం అనే అపవాదు వస్తుందనే కారణంతో చాలా మందికి జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. వాస్తవానికి ఎన్నికలకు ముందు ప్రభుత్వంలో అవకాశం ఇస్తామని చెప్పిన వారికి కూడా ఛాన్స్ దక్కలేదు. ఇక, వీరికి ఎలాంటి హామీలు ఇవ్వలేదు. అయినప్పటికీ.. వీరు ఆశలు పెట్టుకున్నారు.
సొంత పార్టీ నేతలే…..
జగన్ ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా ఐదుగురు ఎస్సీలకు కేబినెట్లో చోటు కల్పించారు. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో రెండు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్లకు సైతం మంత్రి పదవి దక్కలేదు. దీంతో వారంతా గుర్రుగా ఉన్నారు. ఈ ఆశలు తీరకపోవడంతో ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా లీకులు అందిస్తూ.. వ్యతిరేక ప్రచారం సాగేలా వ్యవహరిస్తున్నా రనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డబ్బులు పందేరం చేస్తున్నారే తప్ప.. అభివృద్ధి ఎక్కడ? మంత్రులకు ప్రాధాన్యం లేదు.. అంటూ.. ప్రచారం వెలుగు చూస్తోంది. నిజానికి అనేక కార్యక్రమాలు ప్రవేశ పెట్టిన జగన్.. ప్రజలకు అనేక రూపాల్లో లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో ప్రధానంగా పేదలకు ఇళ్లు పథకం కూడా ఉంది. దీనికి కూడా గండి కొట్టేలా సొంత పార్టీ నేతలే వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
లీకులు అందిస్తూ….
చాలా చోట్ల ప్రభుత్వం ఎంపిక చేసిన భూముల విషయాన్ని ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు ఉప్పందించి.. వాటిపై వ్యతిరేక కథనాలు వచ్చేలా తెరచాటు చక్రం తిప్పుతున్నారని తాజాగా ప్రభుత్వానికి తెలిసింది. దీంతో ఇప్పుడు వీరిని ఏం చేయాలనే విషయంపై జగన్ చర్చిస్తున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఏం చేస్తారో. ఏదేమైనా.. తిన్నంటి వాసాలు లెక్కపెడుతున్న నాయకులతో ప్రభుత్వం ఒకింత ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం అంటున్నారు పరిశీలకులు.