Mon May 06 2024 04:08:47 GMT+0000 (Coordinated Universal Time)
Inter Exams: నేటి నుండి ఇంటర్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి
Inter Exams:ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. నేడు మొదటి ఏడాది, రేపు రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షకు అనుమతించరు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది.
మొత్తంగా 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం 4,73,058 మంది.. రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధం చేసింది. ఏపీలోని ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. దివ్యాంగ విద్యార్థులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే సెంటర్లను కేటాయించారు. వీరికి మరో గంట అదనపు సమయం, పరీక్ష రాసేందుకు సహాయకులను అందుబాటులో ఉంచారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్ను బోర్డు నియమించింది.
Next Story