ఒక సినిమా కోసం ఏడు సంవత్సరాలు వెచ్చించటం సబబే అనిపించింది
లీడర్ తో తెరాన్గ్రేటం చేసిన రానా దగ్గుబాటి కి తరువాత కథానాయకుడిగా నా ఇష్టం, నేను నా రాక్షసి వంటి చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పటికీ వైవిధ్య కథల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ ఆయన ఆ తరువాత తెలుగులో కథానాయకుడిగా మరో చిత్రం చేయలేదు. బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో ప్రతినాయకుడిగా బల్లాల దేవా పాత్ర కోసం అధిక కాల్ షీట్స్ కేటాయించటమే ఇందుకు కారణం. 2013 లో బాహుబలి చిత్రీకరణ ప్రారంభం కాగా ఈ నాలుగు సంవత్సరాలు బాహుబలి కోసం పని చేసిన రానా, బల్లాల దేవుని పాత్ర లో తాను ఏడు సంవత్సరాల నుంచి జీవిస్తున్నాని చెప్పి ఆశ్చర్య పరిచారు. 2012 లో విడుదలైన కృష్ణం వందే జగద్గురుమ్ తరువాత రానా తెలుగు లో కథానాయకుడిగా కనిపించే చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల మందికి రానుంది.
కథానాయకుడిగా అవకాశాలు ఉన్నప్పటికీ ప్రతినాయకుడి పాత్ర కోసం ఇన్ని సంవత్సరాలు వెచ్చించటం మీ కెరీర్ కి ఇబ్బంది అనిపించలేదా అని అడిగిన ప్రశ్నకి, "2013 లో చిత్రీకరణ ప్రారంభం ఐన బాహుబలి చిత్రీకరణ కంటే దాదాపు మూడు సంవత్సరాల ముందే ఈ ప్రతినాయకుడి పాత్ర నా వద్దకి వచ్చింది. అప్పటి నుంచి ఈ పాత్ర కోసం సన్నద్ధమవటం మొదలుపెట్టాను. అయితే ఏడు సంవత్సరాలు ఒకే పాత్ర కోసం పైగా ప్రతినాయకుని పాత్ర కోసం వెచ్చించటం ఎవరి కెరీర్ కైనా ప్రమాదమే. ఏ నటుడికైనా 15 లేదా 16 సంవత్సరాలే యాక్టీవ్ కెరీర్ ఉంటుంది. నేను అటువంటి యాక్టీవ్ కెరీర్ లో సాగ భాగం బాహుబలి చిత్రం కోసం వెచ్చించేసాను. అయితే అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన చిత్రం కోసం అంత సమయాన్ని వెచ్చించినా తప్పు లేదు అనిపిస్తుంది. ఎంత కాలం పని చేసినా పాజిటివ్ స్పందన వస్తే ఆ కష్టం మర్చిపోతాం. మేము బాహుబలి ఫలితం కంటే ఎక్కువగా బాహుబలి చిత్రీకరణలో మేము పొందిన అనుభూతిని ఎక్కువ ఆస్వాదిస్తుంటాను." అని చెప్పాడు రానా దగ్గుబాటి.
ఫెబ్రవరి 17 న రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ఘాజి అదే పేరుతో తెలుగు తమిళ భాషలలో కూడా విడుదల అవుతుంది.
- Tags
- రానా దగ్గుబాటి