ఛల్ మోహన్ రంగ పై నితిన్ కాన్ఫిడెన్స్ అదేనా..?
త్రివిక్రమ్ కథ రాసినా, సినిమాని తెరకెక్కించినా అందరిలో ఎంతో ఇంట్రెస్ట్ తోపాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉంటాయి. మనసుకు హత్తుకునే మాటల తో త్రివిక్రమ్ మాయాజాలం ఉంటుంది. అలాంటి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన అజ్ఞాతవాసిని చూస్తే మాత్రం... ఇది త్రివిక్రమ్ సినిమా అని ఎవరూ ఒప్పుకోరు. అయినా తప్పక నమ్మాల్సిన నిజం అది. అయితే అజ్ఞాతవాసి కథ గతం గతః అన్నట్టు ప్రస్తుతం త్రివిక్రమ్ పెన్ను నుండి జాలువారిన ఛల్ మోహన్ రంగ రేపు గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నితిన్ - మేఘ ఆకాష్ లు జంటగా వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
ప్రస్తుతం థియేటర్స్ లో రామ్ చరణ్ - సుకుమార్ ల రంగస్థలం ల హావా మాములుగా లేదు. మరి రామ్ చరణ్ రంగస్థలానికి పోటీగా అన్నట్టు నితిన్ తన ఛల్ మోహన్ రంగ తో థియేటర్స్ లోకి దిగుతున్నాడు. తన సినిమా మీద ఎంతగా కాన్ఫిడెన్స్ లేకపోతె నితిన్ ఇలాంటి సాహసం చేస్తున్నాడో కదా. ఇక ఈ సినిమాపై అంచనాలు ఉండడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ, రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్, ప్రోమోలలో ఉన్న కామెడీ కంటెంట్ లో త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుండడ మే కాకుండా నితిన్ లుక్స్, అలాగే సెన్సార్ బోర్డు వారిచ్చిన క్లీన్ యూ సర్టిఫికేట్ వెరసి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
అలాగే సెన్సార్ టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ లెంగ్త్ కామెడీతో నింపేశారని.... అలాగే ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ని కూడా అసలు ఊహించలేని విధంగా ఉండడమే కాదు... సెకండాఫ్ అయితే రొమాంటిక్ సన్నివేశాలతో నితిన్, మేఘా ఆకాష్ లు అదుర్స్ అనిపించారని అంటున్నారు. అందుకే నితిన్ కూడా ఎదురు బెదురూ లేకుండా థియేటర్స్ లో సందడి చేయడానికి కాచుకుని కూర్చున్నాడట. ఇక ఈ సినిమాని అసలు త్రివిక్రమే డైరెక్ట్ చెయ్యాల్సి ఉందట. కానీ త్రివిక్రమ్ కున్న కమిట్మెంట్స్ తో ఈ సినిమా కృష్ణ చైతన్యకి వెళ్లిందట. ఇక త్రివిక్రమ్ ఆధ్వర్యంలో కృష్ణ చైతన్య ఈ సినిమాని ఎంతో పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడట. మరో రెండు రోజుల్లోనే ఛల్ మోహన్ రంగ సినిమా కి ఎంత విషయం ఉందొ తేలిపోతుందిలే.