తన కొడుకుని చూసి తాను చాలా నేర్చుకోవాలంటున్న హీరో
2015 దీపావళికి భారీ అంచనాల మధ్యన అక్కినేని వంశం లో మూడవ తరం వారసులలో ఒకరైన అఖిల్ అక్కినేని పరిచయ చిత్రం అఖిల్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమా విడుదల నాటి నుంచే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ అఖిల్ తన తొలి చిత్రం తో 19 కోట్ల పై చిలుకు షేర్ వసూళ్లు చేయగలిగాడు. అక్కినేని అభిమానులు మాత్రం అఖిల్ ఎంట్రీ డిసాస్టర్ కావటంతో చాలా నిరాశచెందారు. దానికి తోడు అఖిల్ తన రెండవ చిత్రం నేటికీ పట్టాలెక్కించకపోవటంతో 2016 లానే 2017 కూడా తమ యువ హీరో కి బ్లాంక్ క్యాలండర్ మిగులుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు అక్కినేని అభిమానులు.
అఖిల్ రెండవ చిత్రానికి ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు పరిశీలనకు రావటం, తరువాత అవేవి పట్టాలెక్కపోవటంతో అఖిల్ రెండవ చిత్రం పై గందరగోళం ఏర్పడింది. మనం ఫేమ్ దర్శకుడు విక్రమ్.కే.కుమార్ అఖిల్ కోసం సిద్ధం చేసిన కథ తో బాగా కన్విన్స్ ఐన నాగార్జున ఇప్పుడు అఖిల్ రెండవ చిత్రాన్ని స్వాగతించే విధంగా అక్కినేని అభిమానులను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. "అఖిల్ తొలి చిత్రం పరాజయం చెందినప్పటికీ అఖిల్ తన రెండవ చిత్రానికి సొంతంగా బజ్ క్రియేట్ చేసుకోగలిగాడు. ఈ విషయంలో అఖిల్ ని చూసి నేను చాలా నేర్చుకోవాల్సి వుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక చిత్రం డిసాస్టర్ ఐన తరువాత చిత్రానికి ఇలా వ్యవహరించటం సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు అఖిల్ కోసం విక్రమ్ సిద్ధం చేసిన కథ కచ్చితంగా నేటి తరం ప్రేక్షకులకు చేరువయ్యే కథే. ఈ కథ కోసమే చాలా రోజులు సమయం వెచ్చించి కథ లాక్ చేసాం. గ్యాప్ పెరుగుతుంది అని అభిమానులు బాధ పడొద్దు. నెంబర్ రేస్ లో ఉండటం కంటే మంచి సినిమా తో ప్రేక్షకుల ముందుకి రావటం మంచిది కదా. అందుకే చాలా కథలు విన్న తరువాత ఈ కథ ఓకే చేసాం." అని అభిమానులని ఉత్తేజ పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు కింగ్ నాగార్జున.