బన్నీ కంటె ముందు ఛాన్స్ దక్కించుకున్న శిరీష్
తమిళ నటులతో పోలిస్తే మన యువ కథానాయకులు ఇతర రాష్ట్రాలలో మార్కెట్ ఏర్పరచుకునే విషయంలో వెనుకంజలోనే వున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా ఇందుకు అతీతులు కారు. కొద్దో గొప్పో అల్లు అర్జున్ ఇతర హీరోల కన్నా ఒక మెట్టు పైన వున్నాడు. అతని చిత్రాలు అన్ని మలయాళం లోకి అనువదించబడుతున్నాయి. కేరళ ప్రజలు వారి హీరోలతో సమానం గానే అల్లు అర్జున్ చిత్రాలను ఆదరిస్తున్నారు. అల్లు అర్జున్ ఒక స్ట్రెయిట్ మలయాళి చిత్రం కూడా చెయ్యాలని వారు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కూడా.
నేరుగా మళయాళ చిత్రం చేసే అవకాశం అల్లు అర్జున్ కన్నా ముందే తన తమ్ముడు అల్లు శిరీష్ కి దక్కింది. ఇటీవల తెలుగులో శ్రీరస్తు శుభమస్తు చిత్రం ద్వారా తొలి విజయం అందుకున్న అల్లు శిరీష్ మల్లిడి వేణు దర్శకత్వంలో ఒక చిత్రం చర్చల దశలోనే ఆగిపోవడంతో, టైగర్ ఫేమ్ వి.ఐ.ఆనంద్ చిత్రానికి అంగీకారం తెలిపాడు. ఇంతలో మళయాళ దర్శకుడు మేజర్ రవి తెరకెక్కించబోయే 1971 చిత్రంలో ఒక పాత్రకు అల్లు శిరీష్ ని సంప్రదించారు. ఈ చిత్రంలో మలయాళం మెగా స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించనుండటం విశేషం.
పాత్రలకు అనుకున్న నటులతో చిత్రీకరణ జరిగితే తెలుగు యువ నటులలో మోహన్ లాల్ తో తెర పంచుకునే అవకాశం దక్కించుకున్న రెండవ హీరో శిరీషే అవుతాడు. ఇటీవల జనతా గ్యారేజ్ చిత్రంలో తారక్ మోహన్ లాల్ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే.