బాలయ్య సిద్దమైపోయాడు కానీ కృష్ణ వంశి కాలేదు
ఈ ఏడాది సంక్రాంతి పండుగకి డిక్టేటర్ చిత్రం విడుదలైన తరువాత నట సింహం నందమూరి బాల కృష్ణ 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రకటన జరగటానికి మధ్య కాలంలో అనేక కథా చర్చలు, రకరకాల ఊహాగానాలు హల్చల్ చేశాయి. బోయపాటి శ్రీను, సింగీతం శ్రీనివాస రావు, సత్యదేవా వంటి పలువురు దర్శకుల చిత్రాలు ఖరారు కావటం ఇంతలోనే కాదనటం, ఈ తంతు అంతా దాదాపు రెండు నెలల పాటు నడిచాక జాగర్లమూడి రాధా కృష్ణ(క్రిష్) గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రీకరణ షెడ్యూల్ ప్రకటించటంతో బాలయ్య 100 వ చిత్రం పై స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రం ఫస్ట్ కాపీ కూడా సిద్దమైపోయి సెన్సార్ కార్యక్రమాలకు తయారవుతుంది. బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రీకరణ దశలో ఉండగానే దర్శకుడు కృష్ణ వంశి చెప్పిన 'రైతు' కథకు ఆకర్షితులై తన 101 వ చిత్రానికి కృష్ణ వంశి ని దర్శకుడిగా ఖరారు చేసేసారు. అప్పటికి కృష్ణ వంశి నక్షత్రం సినిమా ను తెరకెక్కిస్తున్నారు.
డిక్టేటర్ విడుదల నాటికే కృష్ణ వంశి దర్శకత్వంలో నక్షత్రం చిత్రం ఖరారు అయ్యి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో వుంది. కానీ నేటికీ నక్షత్రం చిత్రీకరణ పూర్తి కాలేదు. ఇది తన బౌన్స్ బ్యాక్ చిత్రమవుతుందని పలు మార్లు ప్రకటించిన కృష్ణ వంశి చాలా జాగ్రత్తగా ప్రతి ఫ్రేమ్ ను తన పర్యవేక్షణలో తెరకెక్కిస్తున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అయితే ఇప్పటికే నక్షత్రం విడుదలకు సిద్ధమవ్వాలి కానీ కృష్ణ వంశి నేతృత్వంలో జరుగుతున్న ఆలస్యం కారణంగా నేటికీ విడుదల తేదీపై స్పష్టత రాలేదు. రానున్న రెండు వారాలలో గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రచార కార్యక్రమాలు కూడా ముగించుకోనున్న బాలయ్య 101 వ చిత్రం చిత్రీకరణ కోసం రెడీ ఐపోగా దర్శకుడు కృష్ణ వంశి ఇంకా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించలేదు. కాగా ఈ గ్యాప్ లో బాల కృష్ణ ఎస్.వి.కృష్ణ రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రం చేస్తారనే ప్రచారమూ జోరుగా సాగుతుంది.
- Tags
- కృష్ణ వంశి