మళ్లీ ప్రస్తానం లాంటి చిత్రం చేస్తున్నా
తీసిన నాలుగు చిత్రాలే అయినా దర్శకుడు దేవా కట్ట కి ప్రేక్షకులలో ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు వుంది. దేవా కట్ట దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి రెండు చిత్రాలు వెన్నెల, ప్రస్తానం ప్రేక్షకులని అలరించగా, తరువాతి రెండు చిత్రాలు ఆటో నగర్ సూర్య, డైనమైట్ పరాజయ పాలయ్యాయి. కాగా దేవా కట్ట ఇచ్చిన రెండు సక్సెస్ లలోనూ యువ హీరో శర్వానంద్ ప్రేక్షకులు మర్చిపోలేని పాత్రలే పోషించాడు. ప్రస్తుతం శర్వానంద్ వరుస విజయాలతో పెద్ద నిర్మాణ సంస్థల్లో నటిస్తున్నప్పటికీ కెరీర్ ప్రారంభంలో శర్వానంద్ లోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసి శర్వా కి బ్రేక్ ఇచ్చిన చిత్రాలు వెన్నెల, ప్రస్థానమే. కాగా గత కొంత కాలంగా శర్వానంద్ మళ్లీ దేవా కట్ట దర్శకత్వంలో పని చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారికం గా శర్వా కానీ దర్శకుడు దేవా కానీ స్పందించలేదు.
ప్రస్తుతం శతమానం భవతి విడుదల సందర్భముగా ఆ చిత్ర విశేషాలు ముచ్చటించటానికి ప్రెస్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన శర్వానంద్ దేవా కట్ట చిత్రం పై స్పందిస్తూ, "నా తదుపరి చిత్రాలలో ఒకటి దేవా కట్ట దర్శకత్వంలో ఉండబోతున్న సంగతి తెలిసిందే. మా కాంబినేషన్ లో వచ్చిన ప్రస్తానం తరువాత అటువంటి పాత్ర ఎప్పుడు పోషించలేదు. ఇప్పుడు అంత ఇంటెన్సిటీ వున్న కథ ని, ప్రస్తానం లో నా పాత్ర కి ఉన్నంత ఫోర్స్ తో పాత్ర ని తయారు చేస్తున్నాడు దేవా. కానీ ఈ చిత్రం ప్రస్తానం కి కొనసాగింపు కాదు. ఇది వేరే కథ. నాకు విన్నవెంటనే చాలా బాగా నచ్చింది. నన్ను కలిసినప్పుడు చాలా మంది ప్రేక్షకులు ప్రస్తానం సినిమా గురించే చర్చిస్తారు. అటువంటి చిత్రం ఇంకోటి చేయమని, అటువంటి పాత్రలో మళ్లీ నన్ను చూడాలని ఉందని అడుగుతుంటారు. ఇప్పుడు దేవా కట్ట తో చేయబోయే చిత్రం వారందరి ఆశ నెరవేర్చే చిత్రం అవుతుంది." అని చెప్పాడు యంగ్ హీరో శర్వానంద్.
- Tags
- శర్వానంద్