వారు అనుకున్నదే జరుగుతుంది గాని....?
నందమూరి ఎన్టీ రామారావు జీవితం మీద ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు రెడీ అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ బయో పిక్స్ లో ఎవరికి తోచిన వెర్షన్ వారు తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు తేజ - బాలకృష్ణ కలయికలో ఎన్టీఆర్ బయో పిక్ గా ఆయన జీవితం మొత్తం తెరకెక్కుతుంటే.... రామ్ గోపాల్ వర్మ మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన దగ్గరనుండి ఆయన మరణించేవరకు సినిమా చేస్తానంటున్నాడు. ఇక మరో దర్శకుడు కేతిరెడ్డి మాత్రం లక్ష్మీస్ వీరగ్రంధం అంటూ లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించాక ముందు స్టోరీ అంటున్నాడు. ఇకపోతే మరో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యన్నారాయణ అయితే చంద్రబాబు ముఖ్య పాత్రలో ఎన్టీఆర్ బయో పిక్ అంటున్నాడు.
ప్రారంభోత్సవం కూడా....
అయితే ఈ బయో పిక్స్ లో ఒకటయిన లక్ష్మీస్ వీరగ్రంధం ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. కానీ మిగతా సినిమాలు మాత్రం ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి.. అయితే ఎన్టీఆర్ పై వస్తున్న సినిమాలు ఎక్కువ కావడంతో జనాలు అయోమయం కావడం ఖాయం అంటున్నారు. దాంతో ఇదే ప్రశ్న ని బాలయ్య తో ఎన్టీఆర్ బయోపిక్ ప్లాన్ చేస్తున్న తేజ ని అడిగితే అసలు ఎన్టీఆర్ పై వస్తున్న ఆ సినిమాలు రిలీజ్ అవ్వడం కష్టమే అని తేల్చి పారేసాడు. ఎన్టీఆర్ ఏమైనా ఆటబొమ్మా? ఎలా పడితే అలా ఎవరు పడితే అలా సినిమా తియ్యడానికి అని అంటున్నాడు తేజ.
స్క్రిప్ట్ రూపొందించే పనిలో....
ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పై శ్రద్ధ వహిస్తున్న తేజ ఆ స్క్రిప్ట్ ని రూపొందించే పనిలో ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ పేరు తో ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా వస్తున్న సినిమాలు రిలీజ్ కావని..... ఎందుకంటే ఆ సినిమాలు రిలీజ్ కావాలంటే ఎన్టీఆర్ కుటుంబం అనుమతి తప్పనిసరి అని వాళ్ళు అనుమతి ఇవ్వకపోతే ఆ సినిమా లు రిలీజ్ కావని స్పష్టం చేశాడు తేజ. అంతేగా మరి ప్రస్తుత ఏపీ ప్రభుత్వం, నందమూరి వారసుడు బాలకృష్ణ ఏది అనుకుంటే అదే జరుగుతుందిగాని.... మిగతావారు ఎన్టీఆర్ గురించి హడావిడి చేస్తే మాత్రం వాళ్ళు ఊరుకోవాలిగా.. అందుకే తేజ ఇంత ధైర్యంగా ఆ సినిమాలు విడుదలకావనే స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు.
- Tags
- ఎన్టీఆర్ బయోపిక్