శత పుణ్యక్షేత్రాల్లో శాతకర్ణి వంద కిలోల కుంకుమార్చన
సినిమా పబ్లిసిటీలో ఇదొక భిన్నమైన కార్యక్రమం. ఆధ్యాత్మిక విశ్వాసాలు మెండుగా ఉండే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రానికి సంబంధించి... దేశవ్యాప్తంగా శత పుణ్యక్షేత్రాల్లో పర్యటించి... 100 కిలోల కుంకుమార్చన చేయడానికి నిర్ణయించారు. ఆ రోజుల్లో శాతవాహన సార్వభౌముడు శాతకర్ణి కట్టించిన ఆయన పర్యటించిన, పూజించిన ఆలయాలు అన్నిటినీ ఈ పర్యటనలో చుట్టబోతున్నారు. నవంబరు 5 వ తేదీన ఈ యాత్రను బాలకృష్ణ స్వయంగా ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించిన ఆహ్వానాన్ని బాలకృష్ణ అభిమాని అనంతపురం జగన్ మీడియాకు విడుదల చేశారు.
క్రిష్ దర్శకత్వంలో బాలయ్య ఈ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగానే ఆధ్యాత్మిక విశ్వాసాలు మెండుగా ఉండే బాలయ్య ప్రతి సినిమాకు కొన్ని ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే.. ఈ దఫా.. తాను స్వయంగా అన్ని ఆలయాలూ తిరగకపోతున్నప్పటికీ.. వంద ఆలయాల్లో పూజలకు తన అభిమానులకు అనుమతివ్వడం విశేషం. అలాగే వంద కిలోలతో ఆలయాలన్నిటిలో కుంకుమార్చన చేయించడాన్ని కూడా విశేషంగా చెప్పుకుంటున్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.బ్యానర్పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం కావడంతో నందమూరి అభిమానులు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యండ్ జగన్ అండ్ టీమ్ ఆధ్వర్యంలో భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను నిర్వహిస్తున్నారు. భారతదేశంలోని 100 పుణ్యక్షేత్రాల్లో 100 కేజీల కుంకుమార్చనతో పాటు 23 శివలింగాలకు రుద్రాభిషేక, సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ భారతదేశ సర్వమత శత పుణ్యక్షేత్ర జైత్రయాత్ర నవంబర్ 5న, శనివారం ఉదయం గం.10.45ని. లకు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభం అవుతుంది.