1980 కథకు 2018 తెలివితేటలా సుక్కు
సుకుమార్ సినిమా అంటే మేధస్సుకు పరీక్ష. అతడు కథను అర్థం కాకుండా తీసి ప్రేక్షకుడిని బాగా ఇబ్బంది పెడతాడు ? అన్న టాక్ అయితే ఉంది. ఇక తాజా సినిమా రంగస్థలం విషయానికి వస్తే మామూలు పల్లెటూరి కథను తీసుకున్నాడు. ఈ కథ ఎప్పుడో 1980 కాలం నాటిది అని ముందే చెప్పారు. పెద్దగా అంచనాలతో ఈ సినిమాకు రావొద్దని కూడా సుక్కు చెప్పాడు. అయితే కథ 1980 కాలం నాటిది అని చెప్పినా అది 1950-60 దశకం నాటిదే. ఇది ఏనాడో అరిగిపోయిన ఫార్ములా.
అయితే ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో జనాలు మానవ సంబంధాలను మరచిపోతున్న టైంలో పాతలో కలిసిపోయిన ఓ కొత్త ప్రపంచాన్ని మనకు చూపించడంలో మాత్రం సుక్కు సక్సెస్ అయ్యాడు. అన్నను చంపిన వాళ్ల మీద తమ్ముడు పగ తీర్చుకోవడం అనే చిన్న పాయింట్ బేస్ చేసుకుని సుక్కు మూడు గంటల పాటు ప్రేక్షకుడిని ఒకే వాతావరణంలో కూర్చోపెట్టడం పెద్ద సాహసమే. అయితే సుక్కులో ఉన్న గొప్ప టెక్నీషియన్ ఈ విషయంలో బాగా సక్సెస్ అయ్యాడు.
ఈ క్రమంలోనే సుక్కు ఫస్టాఫ్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేయడంతో ఆ ఎఫెక్ట్ సెకండాఫ్పై ఎక్కువ పడింది. ఇక 1960 నాటి కథనే 80 కథ అని చెప్పిన సుక్కు, నాటి వాతావరణంలో నటులు, పరిస్థితులు, మూడ్ క్రియేట్ చేయడంలో తిరుగులేని సక్సెస్ అయ్యాడు. అయితే క్లైమాక్స్కు ముందు ఇంకా చెప్పాలంటే ఆది పినిశెట్టి చనిపోయినప్పటి నుంచి మాత్రం సుక్కు యూ టర్న్ తీసేసుకున్నాడు.
అప్పటి వరకు ప్రేక్షకుడిని పాతకాలం మూడ్లోకి తీసుకెళ్లిన సుక్కు క్లైమాక్స్కు వచ్చేసరికి మాత్రం 2018 కోణంలో ఆలోచించి ముగింపు పలికాడు. హీరో 1980 కాలంలో పడే ఇబ్బందులకు సొల్యూషన్ అనేది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించాలి... అప్పుడు అతడికి ఉన్న అవగాహన ప్రకారం సినిమాను ముగించాలి గాని 2018 నాటి సినిమాల ప్రభావంతో ముగించినట్టు కనపడుతోంది. ఈ ఒక్క విషయంలో మాత్రం సుకుమార్ తన తీరుకు భిన్నంగా వెళ్లినట్టే అనిపిస్తుంది.