భరత్ ప్రీమియర్ షోల షాక్...
టాలీవుడ్లో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులు ముందుగా ప్రీమియర్ షోలు చూసేయాలి. అర్థరాత్రి అయినా నిద్రపోకుండా ఉండి మరీ షోలు చూసేస్తుంటారు. అయితే ఈ ప్రీమియర్ షోల వల్ల అభిమానుల సంగతి ఎలా ఉన్నా విస్తృతంగా పెరిగిపోయిన సోషల్ మీడియా వల్ల చాలా దెబ్బ పడుతోంది. సినిమా బాగున్నా, లేదా యావరేజ్గా ఉన్నా ఆ హీరో యాంటీ ఫ్యాన్స్, సినిమాకు పెద్దగా కనెక్ట్ అవ్వని వాళ్ల వల్ల నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోతోంది.
ఈ రోజు సినిమా రిలీజ్ అవుతోందంటే ఓవర్సీస్ షోల ఎఫెక్ట్ కొంత, ఇటు అర్ధరాత్రి ప్రీమియర్ల వల్ల ఉదయానికే టాక్ బయటకు వచ్చేస్తోంది. సినిమా బాగుంటే ఓకే కాస్త అంచనాలకు తగ్గినా నెగిటివ్ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు. ఇక ముందుగా రివ్యూ ఇచ్చేయాలన్న పోటీ నేపథ్యంలో రివ్యూలు కూడా ఉదయానికే వచ్చేస్తున్నాయి. దీంతో నిర్మాతలు అర్ధరాత్రి ప్రీమియర్లు అంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చేసింది.
ఈ నేపథ్యంలోనే భరత్ అనే నేను ప్రీమియర్ల విషయంలో చిత్ర యూనిట్ తీవ్రమైన సమాలోచనలు జరిపి అర్ధరాత్రి ప్రీమియర్లను క్యాన్సిల్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రీమియర్లకు ఛాన్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు నిర్మాత దానయ్య చెప్పారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉదయం 5 గంటల నుంచే షోలు స్టార్ట్ అవుతాయి.
పవన్ సినిమాల షోలు అర్ధరాత్రే వేసేశారు. సినిమాలకు ఉదయానికే ప్లాప్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన రంగస్థలంకు ఉదయమే షోలు వేశారు. ఇది బాగా సక్సెస్ అయ్యింది. దీంతో ఇప్పుడు భరత్ అనే నేనుకు కూడా ఇదే ట్రెండ్లో ఉదయం షోల నుంచే సినిమాను రిలీజ్ చేస్తున్నారు.