బన్నీ ఫామ్ హౌస్లో రచ్చ రచ్చ
తెలుగు ఇండస్ట్రీ వాతావరణమే మారిపోయింది. కథానాయకుల మధ్య ఇదివరకటిలా వార్ ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. అందరూ కలిసిమెలిసి సందడి చేస్తున్నారు. ఒకరికి సక్సెస్ వచ్చిందంటే చాలు.. అది అందరిదీ అన్నట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు. అది చూసి అభిమానులు కూడా మారిపోతున్నారు. సినిమా బాగుందంటే ఆ హీరోనా, ఈ హీరోనా అని పట్టించుకోకుండా చూసి విజయాల్ని కట్టబెడుతున్నారు. తెలుగులో ఈ వాతావరణం ముచ్చటగొలుపుతోంది. అది మాత్రమే కాకుండా స్టార్ హీరోలు చిన్న చిత్రాల్ని కూడా చూస్తూ, బాగుందంటే వాటిపై అభినందనలు కురిపిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అది మంచి పరిణామం. నిర్మాతలకి మరింత మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మొన్ననే విడుదలైన 'గీత గోవిందం' చూసి మహేష్బాబు, రామ్చరణ్ మొదలుకొని చాలామంది కథానాయకులు చిత్రాన్ని, విజయ్ దేవరకొండ నటనని అభినందించారు. అల్లు అర్జున్ అయితే మరో అడుగు ముందుకేసి... పర్సనల్గా తన ఫామ్ హౌస్లో 'గీత గోవిందం' టీమ్కీ, ఇండస్ట్రీ ప్రముఖులకి పెద్ద పార్టీని అరేంజ్ చేశాడు. నిన్న రాత్రి జరిగిన ఆ పార్టీలో ఓ రేంజ్లో సందడి కనిపించిందట. అల్లు అర్జున్ తోటి కథానాయకులతో ఎక్కువగా కలవరని పేరుంది. అలాంటిది ఆయన విజయ్ దేవరకొండ సినిమా కోసం ఓ పార్టీనే అరేంజ్ చేశాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 'గీత గోవిందం' అల్లు అర్జున్ కుటుంబ నిర్మాణ సంస్థ అయిన గీత ఆర్ట్స్ నుంచి రూపొందింది. ఇదివరకు కూడా ఆ సంస్థలో చాలామంది ఇతర కథానాయకులు నటించారు కానీ, ఎప్పుడూ లేని రీతిలో బన్నీ సొంతంగా పార్టీని అరేంజ్ చేశాడట. అక్కడ చాలామంది కథానాయకులు హాజరై సందడి చేసినట్టు సమాచారం.