ఛలో మ్యాజిక్ ని రిపీట్ చెయ్యలేకపోయాడు..!
ఎన్ని సినిమాలు చేసినా యావరేజ్ లు లేదంటే ఫ్లాప్స్. అందుకే సొంతంగా తల్లి, తండ్రి, తమ్ముడు కలిసి ఒక బ్యానర్ ని స్థాపించి కొడుకు బాధ్యతను నెత్తినెత్తుకున్నారు నాగ శౌర్య కుటుంబ సభ్యులు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ స్థాపించిన నాగ శౌర్య ఫ్యామిలీ... ఆ నిర్మాణ సంస్థ నుండి వెంకీ కుడుముల దర్శకుడిగా ఛలో సినిమాని లోబడ్జెట్ లో తెరకెక్కించారు. ఆ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా చక్కటి ప్రమోషన్స్ తో మంచి హిట్ అందుకున్నారు. ఇక దర్శకుడు వెంకీకి ఐరా వారు ఒక కాస్ట్లీ కారు కూడా బహుమతిగా ఇచ్చారు. అలాగే హీరోగా తల్లిదండ్రుల నుండి నాగ శౌర్య కూడా ఒక మంచి కారుని బహుమతిగా అందుకున్నాడు.
సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో..!
ఇక అదే ఊపులో మళ్లీ నాగ శౌర్య తన స్వంత బ్యానర్ లోనే @నర్తనశాల సినిమాని శ్రీనివాస్ చక్రవర్తి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మొదలు పెట్టాడు. ఈలోపు ఛలో కన్నా ముందు ఒప్పుకున్న కణం, అమ్మమ్మగారిల్లు సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో, ఎప్పుడు వెళ్ళిపోయాయో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ సినిమా ప్రమోషన్స్ లో నాగ శౌర్య ఎక్కడా కనబడలేదు. దీంతో ఆ సినిమాల గురించి ప్రేక్షకుడికి పెద్దగా తెలియదు, అందుకే పట్టించుకోలేదు. ఇక ఓన్ బ్యానర్ లో చకచకా కానిచ్చేసిన @నర్తనశాల నిన్ననే ప్రేక్షకుల ముందుకు రావడం... ప్రేక్షకులు, క్రిటిక్స్ సినిమాకి ప్లాప్ టాక్ ఇచ్చారు. మంచి ప్రమోషన్స్ తో బరిలోకి దిగినా... నాగ శౌర్య సినిమాలో కంటెంట్, కామెడీ తక్కువ కావడంతో సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది.
పేపర్ బాయ్ కి కలిసివచ్చేనా..?
నాగ శౌర్య ఛలో సినిమాలో నటనతో పోలిస్తే నర్తనశాలలో నటన పరంగా పెద్దగా ఆకట్టుకోలేదని... డైరెక్షన్ స్కిల్స్ అంతంత మాత్రం ఉన్నాయని, కథ, కథనాల్లో ఉన్న లోపాలు, మ్యూజిక్ అంతగా ఎక్కకపోవడం, ఎడిటింగ్ లో షార్ప్ నెస్ లేకపోవడం, కామెడీ ఆకట్టుకోలేపోవడం వెరసి సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. సినిమా మొత్తం మీద జయ ప్రకాష్ రెడ్డి నటన, హీరోయిన్స్ గ్లామర్ షో తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ లేవంటే సినిమా ఎంత ఘోరంగా ఉందో అంటున్నారు. మరి నర్తనశాల సినిమా టాక్ సంతోష్ శోభన్ పేపర్ బాయ్ కి కలిసొచ్చేలాగే కనబడుతుంది. సంపత్ నంది టీమ్ వర్క్ నుండి సంతోష్ శోభన్ - రియా సుమన్ నటించిన పేపర్ బాయ్ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రానుంది.