జగన్ వెర్సస్ లోకేష్ మధ్యలో 'సాక్షి'!
తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టగలిగే అవకాశం ఉన్నట్లుగా ఏ చిన్న సంకేతం కనిపించినా సరే.. దానికోసం ఎగబడిపోవడం వైకాపా లక్షణం. విపక్షం మరియు ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ముఖ్యం గనుక.. అదంతా సబబుగానే కనిపిస్తుంది. కాకపోతే.. ఆ లక్షణాన్ని సాక్షి మీడియా కూడా అందిపుచ్చుకుంటేనే.. కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
శిక్షణ శిబిరంలో చినరాజప్పకు లోకేష్కు సంభాషణకు సంబంధించిన ఓ ఫోటో బయటకు రావడం, ఆ ఫోటోలో వారు ఏం మాట్లాడుకుంటున్నారో వక్రభాష్యాలు పులుముతూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడం, సోషల్ మీడియాలో ఇలా ప్రచారం జరుగుతున్నదంటూ సాక్షి ఆ వ్యవహారాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లడం.. వెరసి.. ఆధారాల సహా లోకేష్ వీడియోను విడుదల చేసి.. జగన్ను కార్నర్ చేసి.. క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేయడం తాజా పరిణామాలు.
పైన ఉన్న ఫోటో చూపించి.. లోకేష్ చినరాజప్పను వేదికమీదినుంచే మందలించారని, ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని చాలా అసహ్యమైన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వీటిపట్ల ఆగ్రహించిన లోకేష్.. ఇవాళ అసలు వీడియో లనే విడుదల చేశారు. ఆ సందర్భంలో పార్టీ నిర్మాణం గురించి చర్చ జరుగుతున్నప్పుడు గ్రామ మండల కమిటీలు ఎలా ఏర్పడుతాయనే మాటలు వారు మాట్లాడుకున్నారు తప్ప.. అందులో చినరాజప్పను మందలించే ఎలాంటి విషయాలూ లేవు.
ఈ వీడియోలను రిలీజ్ చేసి.. లోకేష్ జగన్ ను కార్నర్ చేశారు. అసహ్యమైన ప్రచారానికి తెగబడ్డారంటూ విమర్శిస్తున్నారు. పెద్దలను గౌరవించడం నాకు నా తల్లిదండ్రులు నేర్పారు. నీలాంటి వాడిని కాదు.. ఇలాంటి అసత్య ప్రచారం చేసినందుకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. వీడియోను గమనించిన ఎవ్వరికైనా లోకేష్ మాటలు నిజమని తెలిసిపోతుంది. జగన్ కోటరీ పప్పులో కాలేసినట్లు తెలుస్తుంది.
సాక్షిమీడియాలో ఫోటో ఒకటి దుష్ప్రచారానికి అనువుగా దొరకగానే.. ఎగబడి.. చిలవలు పలవలు అల్లేసిన వారెవరోగానీ.. జగన్ను బజారుకీడ్చారని అంతా అనుకుంటున్నారు.