రామ్ ఔర్ అల్లా.. పడోసియోం బనేగా!!
అయోధ్యలో రామజన్మభూమి స్థలం వివాదం పరిష్కారం కోసం సుప్రీం కోర్టు ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ తరఫున ఫైజాబాద్ డివిజనల్ కమిషనర్ కు ఒక వినతిపత్రం అందించారు. దాని ప్రకారం వివాదాస్పద స్థలంలో రామాలయాన్ని, మసీదును పక్కపక్కనే నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ వివాదస్థలంలో రామాలయాన్ని, మసీదును పక్కపక్కనే నిర్మించేట్లయితే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని.. ఇరు మతాలకు చెందిన పదివేల మందికి పైగా ఆ వినతిపత్రం మీద సంతకాలు కూడా చేశారుట.
ఏతావతా.. కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో ఆరని కార్చిచ్చులాగా ఉన్న అయోధ్య రామజన్మభూమి వివాదం.. ఈ ప్రభుత్వ హయాంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాముడు, అల్లా ఇరుగుపొరుగు వారయ్యే అవకాశం ఉంది. మన దేశానికే వన్నెతెచ్చే పరమత సహనం అనేది, అచ్చంగా ఈ అయోధ్యలో ఆచరణలో పరిఢవిల్లే అవకాశమూ కనిపిస్తోంది. యూపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పలోక్ బసు నేతృత్వంలో ఇరు మతాలకు చెందిన వారు ఇలాంటి ఒక ఏకాభిప్రాయాన్ని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మొత్తానికి ఏదో ఒక రూపంలో ఇక్కడి వివాదం పరిష్కారం అయితే చాలునని జాతి కోరుకుంటుందనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
రాముడి వ్యవహారం అయోధ్య వాసులది మాత్రమేనా?
అయితే ఇక్కడొక ధర్మసందేహం తలెత్తుతోంది. రాముడి జన్మస్థలానికి లేదా బాబ్రీ కట్టడానికి సంబంధించిన సమస్య లేదా సెంటిమెంటు అనేది కేవలం అయోధ్య వాసులు, ఆ పరిసరాల్లో నివసించే వారికి మాత్రమే సంబంధించినదా? దేశమంతటికీ దానితో నిమిత్తం లేదా? కేవలం అయోధ్య ప్రాంతంలోని ఇరు మతాలకు చెందిన పది వేల మంది ఒక నిర్ణయం మీద సంతకాలు చేసి ఇచ్చేస్తే దాన్ని అమల్లో పెట్టేయడం సమంజసమేనా? అనేది ఒక చర్చనీయాంశంగా ఉంది. ఇలా ఉభయ తారకంగా.. రాముడి ఆలయం, బాబ్రీ కట్టడాన్ని పక్కపక్కనే కట్టడం వంటి ఏర్పాటును దేశంలోని సెక్యులర్ వాదులు, లేదా తటస్థ వాదులు ఒప్పుకోవచ్చు. కానీ.. దేశంలో మెజారిటీ అభిప్రాయం అదేనే. మరి మెజారిటీ అభిప్రాయానికి విలువ ఉంటుందా? ఉండదా? అనే అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.