Thu May 02 2024 11:21:19 GMT+0000 (Coordinated Universal Time)
నా తండ్రిని దూషించి నన్ను రెచ్చగొట్టి అప్రదిష్టపాలు చేసే కుట్ర : MLA వివేకానంద
తనపై అనవసర నిందారోపణలు చేసి తన కుటుంబాన్ని అప్రదిష్టపాలు చేయడానికి కూన శ్రీశైలం గౌడ్ ప్రయత్నించారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. ఆయన "తెలుగు పోస్టు"తో మాట్లాడుతూ తాను ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే వ్యక్తినని అన్నారు.
తనపై అనవసర నిందారోపణలు చేసి తన కుటుంబాన్ని అప్రదిష్టపాలు చేయడానికి కూన శ్రీశైలం గౌడ్ ప్రయత్నించారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. ఆయన "తెలుగు పోస్టు"తో మాట్లాడుతూ తాను ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే వ్యక్తినని అన్నారు. తన కన్నతండ్రిని కబ్జాకోరు అని ఆరోపించడంతో తనకు కోపం వచ్చిందని ఆయన తెలిపారు. తాను నియోజకవర్గం అభివృద్ధికి గత పదేళ్లుగా ఎంతో కృషి చేస్తున్నానని వివేకానంద తెలిపారు. రెచ్చగొట్టి తనను బద్నాం చేసేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే నిన్నటి ఘటన చోటు చేసుకుందని ఆయన అన్నారు.
దురదృష్టకరమే...
నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమని వివేకానంద అంగీకరించారు. తన కుటుంబంపై నిందారోపణలు చేసే ముందు అందుకు తగిన ఆధారాలు చూపి ఉంటే దానికి తాను సమాధానం చెప్పేవాడినని అన్నారు. అలా కాకుండా ప్రజల్లోకి తప్పుడు సమాచారం పంపేలా శ్రీశైలం గౌడ్ ప్రయత్నించారని ఆయన అన్నారు. తనను దమ్ముంటే ఓడించేలా ప్రజాస్వామ్య యుతంగా ప్రయత్నించాలని కోరారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై తాను ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
అభివృద్ధిపై...
చర్చలు జరిగే సమయంలో అభివృద్ధిపై మాట్లాడకుండా కుటుంబ సభ్యులను బజారు కీడ్చాలని చేసిన ప్రయత్నం తనకు ఆగ్రహం కలిగించిందన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవరినీ దూషించనూ కూడా లేదని, అలాంటిది చేయి చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అది ప్రజలు అర్థం చేసుకుంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ప్రజల మనిషినని, ప్రచారంలో తనకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రత్యర్థులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ వివేకానంద ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీ వాళ్లు తన తల్లిని, కుటుంబాన్ని దూషించిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. దీన్ని బట్టి చూస్తే కుట్రపూర్వకంగా నన్ను ఎలాగైనా రెచ్చగొట్టి మైలేజీ పొందాలని చేసిన కుట్రలో భాగమే ఇది అని క్లియర్ గా అర్థం అవుతుందని ఆయన అన్నారు.
Next Story