ఇదీ నవీన్...విజయరహస్యం
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. బిజూ జనతాదళ్ ను అప్రతిహతంగా మూడుసార్లు వరుసగా విజయబాటను పట్టించిన నేత. గత 15 ఏళ్ల నుంచి ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ప్రతి ఎన్నికల్లో బలం పెంచుకుంటూ పోతారు. ప్రతిపక్షాల బలం తగ్గుతూ వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నవీన్ పట్నాయక్ గురించి ప్రస్తావించడంతో ఇప్పడు నవీన్ ఏపీలో హాట్ టాపిక్ గా మారారు. ఆయన జనాకర్షక పథకాలను ప్రకటించడం...అమలుపర్చడంలో దిట్ట.
నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరంలోనే రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి వరకూ ఆయనకు రాజకీయాలంటే అసలు తెలీదు. గిట్టదు కూడా. అటువంటి నవీన్, తండ్రి బిజూ పట్నాయక్ మరణంతో రాజకీయ ప్రవేశం చేశారు. నవీన్ ఎప్పడూ సొంత రాష్ట్రం పైనే దృష్టి కేంద్రీకరిస్తారు. జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగాలని చూడరు. ఆ ఆలోచన కూడా చేయరని ఆయన సన్నిహితులు చెబుతారు. ఆయన ఏపార్టీకి కొమ్ము కాయరు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా? అని అధికార పార్టీ పంచన చేరే ప్రసక్తి లేదు. స్వంతంగానే పోరాడి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రయోజనాలను పట్టుబట్టి తెచ్చుకుంటారు. పేద, మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే పథకాల వైపే ఆయన చూపు ఉంటుంది. ఒక పథకాన్ని నవీన్ ప్రకటించారంటే...అది క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా సరైన రీతిలో అమలు జరగాల్సిందే. ఒడిషాలో స్థానిక సంస్థలతో సహా ఏ ఎన్నికలోనైనా బిజూ జనతాదళ్ దే విజయం. కేవలం పార్టీ టిక్కెట్లతో ...అభ్యర్ధులను మార్చి నవీన్ గెలవడం లేదు. నిత్యం జనం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పట్నాయక్ విజయపరంపర కొనసాగిస్తున్నారు.
..చంద్రబాబు గారు ఇది కూడా తెలుసుకోవాలని ...తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు..
- Tags
- నవీన్ పట్నాయక్