ఈ ఐ.ఏ.ఎస్ లు మొబైల్ టచ్ చేయరు..
చూశారా..వారు ఐఏఎస్ చదివారు..ఇంగ్లీషు..హిందీ..అనర్గళంగా మాట్లాతారు. రాస్తారు. కాని వారికి డిజిటల్ పరిజ్ఞానం లేదు. కలెక్టర్లు, ఉన్నతాధికారులే నగదు రహిత లావాదేవీలు చేయడం లేదు. చేతిలో ఖరీదైన మొబైల్ ఉన్నా..మొబైల్ ట్రాన్సాక్షన్ కు ఇష్టపడటం లేదు. ఎక్కడో కాదు. నోట్ల రద్దుతో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి కేంద్రం నియమించిన కమిటీ ఛైర్మన్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు ఇలాకాలో. దేశమంతా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలంటూ అటు ప్రధాని మోదీ, ఇటు ముఖ్యమంత్రులూ పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణులు డిజిటల్ మనీ వైపు మొగ్గు చూపాలని కోరుతున్నారు. నగదు రహిత రాష్ట్ర్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. కాని జరుగుతున్నదేమిటి? బాగా చదువుకున్న...పరిజ్ఞానమున్న వారే డిజిటల్ లావాదేవీల పట్ల విముఖత చూపుతున్నారు.ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న అధికారుల్లో కేవలం 20 శాతం మంది మాత్రమే డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారట. మిగిలినవారంతా అదంటే భయపడిపోతున్నారట. ఈ విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు ఆశ్చర్యపోయారట. గురువారం విజయవాడలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో చంద్రబాబు ఈ సంగతిని గుర్తించారు.
మరి సామాన్యుల సంగతేంటి?
చదువుకున్నోళ్లే డిజిటల్ లావాదేవీలు చేయాలంటే వెనుకంజ వేస్తున్నారు. దానికి సవాలక్ష కారణాలు. ఒకటి ముఖ్యంగా పాస్ వార్డ్ లు, యూజర్ నెంబర్లు గుర్తుంచుకోలేక పోవడం. అవి ఎక్కడైనా రికార్డు చేసుకుంటే ఇబ్బంది అవుతుందని భయపడటం. రెండోది తమ ఖాతాలు ఎక్కడ హ్యాక్ అవుతాయోనన్న భయం. ఎక్కడ చూసినా హ్యాకింగ్ గురైనట్లు వస్తున్న వార్తలే. అందుకే డిజిటల్ లావాదేవీల పట్ల భద్రత లేదన్నది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. ఉన్నతాధికారుల వద్ద ఖరీదైన స్మార్ట్ ఫోన్లే ఉంటాయి. కాని వారు మొబైల్ లావాదేవీలు చేయడానికి మాత్రం ఇష్టపడటం లేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే డిజిటల్ కు వెనుకంజ వేస్తుంటే మరి సామాన్యుల సంగతేంటి? నిరక్ష్యరాస్యుల మాటేమిటి? ఇప్పటికైనా ముందు ఇంటిని సరిదిద్దుకుని తర్వాత సమాజాన్ని ఉద్ధరిస్తే చంద్రబాబుకు మంచిదంటున్నారు విశ్లేషకులు.