గాలి వైభవంపై ఐటీ నజర్!
వివాహ ఆహ్వాన పత్రిక ఒక్కొక్కటి 7 వేల రూపాయల ఖర్చుతో తయారు చేయించడం అంటే.. సామాన్యులే కాదు కుబేరులు కూడా నోరు వెళ్లబెట్టేస్తారు. ఆ రకంగా.. మన దేశంలోనే అత్యంత ధనమయమైన వివాహాన్ని గాలి జనార్దన రెడ్డి తన కుమార్తె కు కానుకగా ఇచ్చారు. అక్రమార్జనలకు సంబంధించి పలు రకాల కేసుల్లో నిందితుడు, ప్రస్తుతం బెయిలుపై ఉన్న గాలి జనార్దనరెడ్డి తన కుమార్తె వివాహాన్ని ఎంత ఘనంగా నిర్వహించారంటే... ఆయనకు సన్నిహితులైన రాజకీయ ప్రముఖులు కూడా అనేక మంది , ఆ పెళ్లికి హాజరైతే తమకు ఎలాంటి అక్రమాలతో ముడిపెట్టేస్తారో అని భయపడి ఆగిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. కనులు మిరుమిట్లు గొలిపే వైభవంతో ఆ పెళ్లి జరిగింది. వందలకోట్లలోనే పెళ్లి ఖర్చులు ఉంటాయనేది అంచనా.
పెళ్లితో సమస్తం ముగిసిపోలేదు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ మరియు దాని యజమాని గాలి జనార్దన రెడ్డి వ్యాపారాలు, ఇళ్లు, వ్యవహాలపై ఆదాయపు పన్ను శాఖ సోమవారం నాడు దాడులు ప్రారంభించింది. ప్రధానంగా కూతురు పెళ్లికి అయిన ఖర్చులు వాటికి సంబంధించిన డబ్బు వనరుల గురించే ఈ సోదాల్లో ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు ఓబులాపురం మైన్స్ కార్యాలయం నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లగా వార్తలు వస్తున్నాయి. గాలి పెళ్లి మీద జరుగుతున్న ఐటీ దాడుల్లో ఏం నిగ్గుతేలుతుందో ఎంత ఖర్చు లెక్క తేలుతుందో.. అందులో ఎన్ని ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయో చూడాలి.