జనసేన వసూళ్లపై వపన్ సీరియస్
జనసేన పేరుతో వసూళ్ల పర్వం మొదలు కావడంతో పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేయాల్సి వచ్చింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో జాప్యం జరుగుతుండటంతో కొన్ని జిల్లాలో జనసేన నేతలమంటూ కొందరు ప్రకటించేసుకున్నారు. వారికి వారే హోదాలు కూడా ఇచ్చుకున్నారు. ఏదైనా సందర్భం వచ్చినపుడు నలుగురైదుగురుని పోగేసుకుని హడావుడి చేయడం., టీవీ లలో డిస్కషన్ లు పెట్టడం పరిపాటిగా మారింది. ఇటీవల ఇది శృతి మించి వసూళ్ల వరకు వెళ్లడంతో పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదులు అందాయి.దీంతో జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. జనసేన ప్రతినిధులమంటూ కొందరు ప్రచారం చేసుకుంటున్నారని ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పార్టీ ప్రతినిధి పేరుతో విరాళాలు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసిందని., జనసేన తరుపున చర్చల్లో పాల్గొనేందుకు ఎవర్నీ నియమించలేదని పీకే ప్రకటించారు.మీడియా చర్చల్లో అలాంటి వ్యక్తులు చెప్పే వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని., పార్టీ నిర్మాణం కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నామని వివరణ ఇచ్చారు. అన్ని అర్హతలు ఉన్నవారిని ప్రతినిధులుగా నియమిస్తామని., జనసేన పేరుతో మోసాలకు పాల్పడే వారిపై అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఎప్పుడో మూడ్ వచ్చినపుడు తప్ప అక్టీవ్ పాలిటిక్స్ లో ఉండకపోతే ఇలాంటి తలనొప్పులు వస్తాయని పవన్ గుర్తిస్తే మంచిది.
- Tags
- జనసేన