దత్తన్న ఆ పనిచేస్తే చరిత్రలో మిగులుతారు
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి పథకాలు రాబట్టడం, లబ్ధి చేకూర్చే విషయంలో వెంకయ్యనాయుడు తాను ఏదో చేసేసినట్లు ఎంతగా టముకు వేసుకుంటున్నప్పటికీ.. వాస్తవంగా ఆయన చేసింది శూన్యం అని జనం మొత్తం అనుకుంటున్నారు. అలాంటిది.. తెలంగాణకు సంబంధించి.. కేంద్రంనుంచి రాష్ట్రానికి మేలు చేసేలా చొరవ తీసుకున్నట్లుగా చరిత్రలో నిలిచిపోగల అవకాశం ఇప్పుడు కేంద్రమంత్రి దత్తాత్రేయకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకువస్తా అంటూ దత్తన్న ఇప్పుడు ప్రకటిస్తున్నారు. ఆయన చెబుతున్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తే గనుక.. తెలంగాణ వాసుల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఉండిపోతారన్నది నిజం.
నిజానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఊసులు ఇంతగా వేగం పుంజుకోవడానికంటె ముందునుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, దాని నిర్మాణ బాధ్యతను మొత్తం కేంద్రం స్వీకరించాలని ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది. తెలంగాణకు చాలా పెద్దదైన ఈ ప్రాజెక్టును కేంద్రం చేపడితే రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రలోనూ ఈ డిమాండ్లు వినిపించాయి. రాష్ర్ట విభజన సందర్భంగా చాలా రకాలుగా నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్కు ఎంతో కొంత మేలు చేసేందుకు పోలవరం కు జాతీయ హోదా ఇస్తున్నట్లు చట్టంలో పేర్కొనడంతో తెలంగాణ గళాల్లో కాళేశ్వరంకు జాతీయ హోదా విషయం కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. అప్పటినుంచి తెలంగాణ నాయకులు సమయం కుదిరినప్పుడెల్లా కాళేశ్వరంకు జాతీయ హోదా కావాలని అడుగుతూనే ఉన్నారు.
ఈవిషయంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ గతంలో కూడా కొన్ని సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మంచిర్యాల లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి , జాతీయ హోదా సాధించేందుకు తాను ప్రధాని మోదీతో మాట్లాడుతానంటూ చొరవ ప్రదర్శించారు. ఆయన ద్వారా హోదా గనుక సాద్యమైందంటే.. ఇక ఆ ప్రాంత ప్రజలు భాజపాను కూడా నెత్తిన పెట్టుకుంటారని అనుకోవచ్చు. మరి మోదీ దత్తన్న మాటను చెవిన వేసుకుంటారా లేదా అన్నదే అసలు కీలకంగా ఇప్పుడు మారనుంది.