పాలమూరు జిల్లాలో గిరి పుత్రుల కష్టాలు...
తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా అత్యుత్తమ ఘనతను దక్కించుకుంది. మహబూబ్ నగర్ జిల్లాను సారా రహిత జిల్లాగా మార్చడంలో ఎక్సైజ్ అధికారులు కృతకృత్యులయ్యారు. రాష్ట్రంలోనే సారా రహిత జిల్లాగా మహబూబ్ నగర్ క్రెడిట్ సాధించింది. అయితే ఇదే జిల్లాలోని గిరిజనులకు చేటు తెచ్చిపెట్టింది. సారా కాయకున్నా అక్రమ కేసులను గిరిజనులపై బనాయిస్తున్నారన్న ఆరోపణను జిల్లా ఎక్సైజ్ శాఖ ఎదుర్కొంటోంది. అర్ధరాత్రి తండాలపై దాడి చేయడం, మహిళలని కూడా చూడకుండా వేధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమ కేసులు బనాయిస్తూ....
వనపర్తి మండలం పరిధిలోని పెద్దగూడెం తండా వాసులపై ఎక్సైజ్ అధికారుల దాడి ఘటన విస్మయ పరిచింది. రాష్ట్రంలోని సారా రహిత జిల్లాగా ప్రకటించుకున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎక్సైజ్ అధికారులు అది కాపాడుకోవడానికి అమాయక గిరిజనులపై దాడికి దిగుతున్నారు. వేల సంఖ్యలో గిరిజనులపై సారా కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి పెద్దగూడెం తండా వాసులు సారా తయారీని మానుకున్నామని చెబుతున్నారు. అయినా ఎక్సైజ్ అధికారులు తండాలపై పడి చితకబాదుతున్నారని గిరిపుత్రులు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది. తమను నిత్యం వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పగలు, రాత్రి లేకుండా తమ తండాపై దాడులు చేస్తున్నారని వారు చెబుతున్నారు. విచక్షణా రహితంగా కొడుతున్నారని దెబ్బలు కూడా చూపించారు. ఇంట్లో నిద్రిస్తున్న తమను నిద్రలేపి మరీ స్టేషన్ కు తీసుకొచ్చి చితకబాదుతున్నారని ఆరోపిస్తున్నారు. తాము సారా తయారీ మానేసి కొన్నేళ్లవుతున్నా ఇంకా ఎక్సైజ్ అధికారులు వేధిస్తూనే ఉన్నారని కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతోనే తాము మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం తాము వారిని కొట్టలేదని, కేసులు మాత్రం కొందరిపై నమోదు చేశామని చెబుతున్నారు. మరి దీనిపై మానవ హక్కుల సంఘం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
- Tags
- మహబూబ్ నగర్