యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా?
ఈ దేశానికి ప్రధానిగా నాయకత్వం వహిస్తున్న వ్యక్తి 'ప్రతీకారం తీర్చుకుంటాం. 1965లో పాక్పై భారత్ యుద్ధానికి దిగిన నాటి పరిస్థితులే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నాయ్.. అందరిలో జాతీయతా వాదం ఉట్టిపడుతోంది' అంటున్నారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు 'దీర్ఘకాల యుద్ధానికి దిగేలాగా పాకిస్తాన్ ఈ ఉగ్రదాడి ద్వారా మనల్ని ప్రేరేపిస్తున్నది' అని ముక్తాయిస్తున్నారు. కేంద్రప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఈ పెద్దల మాటల్లోని అంతరార్థం ఏమిటి? భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతున్నదా? ఆ ఆలోచనతో ఉన్నదా? అని ప్రజలు అంచనాలు వేస్తున్నారు.
ఉరీ దాడులు మాత్రమే కాకుండా, తదనంతర పరిణామాల్లో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఇరుదేశాల మధ్య సంబంధాలను దారుణంగా దెబ్బతీసే మాదిరిగానే మారాయి. ఆ నేపథ్యంలో భాజపా సర్కారు పాక్ పై యుద్ధానికి కాలుదువ్వే వాతావరణం కనిపిస్తోంది.
ఇటీవల త్రివిధదళాధిపతులతో మోదీ సమావేశం, తర్వాత చెబుతున్న మాటలు ఇవన్నీ కూడా అలాంటి సంకేతాలు ఇస్తున్నాయి. అయితే ఈ సంక్లిష్ట సమయంలో ఐరాస వేదిక మీదినుంచి మన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఏం మాట్లాడబోతోంది అనేది కూడా కీలకం. ఆమె ప్రసంగం .. భారత్ వైఖరి గురించి అంతర్జాతీయ దేశాలకు మరింత స్పష్టత ఇస్తుందని అనుకోవచ్చు.