సి.ఐ.డి పోలీసులఅపార్ట్ మెంట్లో చోరీ!
దొంగలకేం తెలుసు వాళ్లంతా సిఐడి సిబ్బందని..... ఆదమరిచి నిద్రిస్తుంటే చక్కగా తమ పని పూర్తి చేసుకున్నారు. తెల్లారి లేచేసరికి బ్యాగులన్ని ఖాళీ అవడంతో లబోదిబోమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ సిఐడి హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్న 15మంది సిబ్బంది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు బైపాస్ రోడ్డు పక్కన వున్న అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు.ఏపీ సి.ఐ.డిలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ అయిన 15 మంది ఉద్యోగులు 4 గదులలో ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి ఫ్యామిలీలు షిఫ్ట్ చేయని వారు అంతా ఒకే చోట అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. మొదటి గదిలో మహిళా ఉద్యోగినులు వుంటున్నారు. ఎండాకాలం కావడంతో రాత్రి అపార్ట్మెంట్ లో బాల్కనీ తలుపులు తీసి కూలర్ పెట్టుకుని నిద్రపోయారు. దీంతో లేడీస్ రూమ్ లో దొంగతనం పాల్పడ్డారు. ఉదయం 4:30 గంటలకు నిద్రలేచి చూసినపుడు బ్యాగ్స్, వస్తువులు చెల్లా చెదురుగా వుండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు.దొంగలు 30వేలు నగదు, సుమారు 15 వేలు రూపాయల విలువ చేసే 5 సెల్ ఫోన్లు, 75 వేలు విలువ చేసే రెండున్నర సవర్ల బంగారం దొంగిలించారు. బాధితుల ఫిర్యాదుతో మంగళగిరి రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు.