జర్నలిస్ట్ బతుకు
సిఎన్ రావు బాబాయ్…. అంటే ఢిల్లీ వెళ్లే తెలుగు జర్నలిస్ట్ మిత్రులకు ఓ ఆప్తుడు…. పెద్ద చిన్న తేడా లేకుండా అందరితో ఆప్యాయంగా పలకరించే మనిషి. అప్పుడే [more]
సిఎన్ రావు బాబాయ్…. అంటే ఢిల్లీ వెళ్లే తెలుగు జర్నలిస్ట్ మిత్రులకు ఓ ఆప్తుడు…. పెద్ద చిన్న తేడా లేకుండా అందరితో ఆప్యాయంగా పలకరించే మనిషి. అప్పుడే [more]
సిఎన్ రావు బాబాయ్…. అంటే ఢిల్లీ వెళ్లే తెలుగు జర్నలిస్ట్ మిత్రులకు ఓ ఆప్తుడు…. పెద్ద చిన్న తేడా లేకుండా అందరితో ఆప్యాయంగా పలకరించే మనిషి. అప్పుడే ఢిల్లీలో అడుగు పెట్టిన పిల్ల జర్నలిస్టుల నుంచి కాకలు తీరిన రాజకీయ నాయకుల వరకు అందరికి దగ్గరి మనిషి. పార్టీలు, అఫిలియేషన్లతో సంబంధం లేకుండా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గా 40ఏళ్లుగా ఢిల్లీలోనే ఆయన మకాం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలుర్తి నుంచి చాలా ఏళ్ల క్రితమే ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడే స్థిర పడ్డారు. 80వ దశకం నుంచి ఢిల్లీలో అడుగు పెట్టే పార్లమెంటేరియన్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు అందరికి ఆప్తుడు. వయసు మీద పడినా జర్నలిస్టుగానే కొనసాగుతున్నారు.
సీనియర్ ఫొటోగ్రాఫర్ గా….
రెండ్రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన రావు, కిడ్నీ లు విఫలం అవడంతో మృతి చెందారు. 1983లో అలీన దేశాల సమాఖ్య ఫోటోగ్రాఫర్ గా(NAMEDIA) కెరీర్ ప్రారంభించిన రావు, PTI, దైనిక్ జగరణ్, హాంకాంగ్ నుంచి వెలువడే ASIA WEEK, తర్వాత న్యూస్ టైం, ఫ్రంట్ లైన్, 95-2000 మధ్య ఆంధ్ర జ్యోతి, 2001 నుంచి ఈనాడు ఫోటో గ్రాఫర్ గా పని చేస్తున్నారు. అప్పుడే ఢిల్లీలో అడుగుపెట్టే కుర్ర జర్నలిస్టులు, నేతల్ని గట్టిగా ప్రశ్నిస్తే భలే అడిగావ్ బాబాయ్ అని భుజం తట్టి ప్రోత్సహించేవాడు. సీనియర్లు వేస్ట్….. అడగరు అని కన్ను గీటే వాడు. అందులో బోలెడు అర్దాలు దొరికేవి. గుప్పు గుప్పున సిగరెట్లు ఎందుకు తాగేస్తావ్ బాబాయ్ అంటే , ఏదో అప్పుడప్పుడు, పొద్దాకా తాగడం లేదుగా?, కావాలంటే అడుగు అని ఇంకొకర్ని సాక్ష్యం చెప్పించే వాడు. అయినా మా టెన్షన్స్ మావి….ఈ వయసొచ్చాక తెలుసిద్దిలే అనే వాడు. నిన్న ఆయన చనిపోయారని తెలియగానే అయ్యో బాబాయ్ అనిపించింది. ఉదయం లేవగానే ఈనాడులో 19 ఏళ్లుగా పని చేస్తున్న మనిషి పోతే వార్త వేయకుండా ఉంటారా అని మొత్తం వెదికినా ఎక్కడా కనిపించలేదు. నమస్తే తెలంగాణ, ప్రజాశక్తి వంటి పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఈనాడులో ఎక్కడా కనిపించలేదు. అవసరం లేదనుకున్నారో, ఎక్కడైనా టాబ్లాయిడ్ లో వేశారో కానీ, జర్నలిస్ట్ బతుకింతే కదా అనిపించింది. ఊళ్ళో ఎవరైనా చనిపోతే చదివే వాళ్ళకి వార్త కానీ రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో జరిగే చిత్రాలు క్లిక్ అనిపించే ఫోటోగ్రాఫర్ పోతే ఏముంది…. అనుకుని ఉంటారు.
– సీనియర్ జర్నలిస్ట్ మనోవేదన