వైసీపీ గూటికి మాజీ మంత్రి
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలనుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. ఆయన వచ్చే వారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఉదయగిరి, వెంకటగిరి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్ స్థానాల్లో ఒక స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఆనం కుటుంబం జిల్లాలో చక్రం తిప్పింది. రాంనారయణ రెడ్డితో పాటు ఆయన సోదరుడు వివేకానందరెడ్డి కూడా మంత్రులుగా పనిచేశారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆనం కుటుంబం కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశంలో చేరింది. అయితే, టీడీపీలో వారికి ఆశించిన గుర్తింపు దక్కలేదు. దీంతో గత కన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో మంచి పట్టు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆనం చేరికతో అదనపు బలం చేకూరనుంది.