రోడ్ల మీద నిలబెట్టారన్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగేళ్లుగా సర్వం దోచుకుని ప్రజలను రోడ్ల మీదకు తెచ్చారని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వై.ఎస్.జగన్ ప్రజా సంకల్పయాత్ర శనివారం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో జరిగింది. రామచంద్రాపురం మార్కెట్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్లుగా బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు ఎన్నికల ముందు విడాకులు తీసుకుని ప్రజల చెవిల్లో కాలీఫ్లవర్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
పాముకు కోరల్లో విషం ఉంటే, తేలుకు తోకలో ఉంటుందని, కానీ దుష్టుడికి నిలువెళ్లా విషం ఉంటుందని, చంద్రబాబు పాలన కూడా అలానే ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ఏదైనా చెప్పి ప్రజలను మోసం చేయగలరని, వినేవాడు అమాయకుడైతే, చెప్పేవాడు చంద్రబాబు అని పేర్కొన్నారు. బడి పక్కన, గుడి పక్కల బెల్ట్ షాపులు, మరుగుదొడ్లు మంజూరు చేయడానికి కూడా మామూళ్లు తీసుకుంటున్నారని విమర్శించారు.