జగన్ ఎదుటే ఆ టీడీపీ కార్యకర్త...?
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. స్థానికులను పలకరిస్తూ జగన్ ముందుకుసాగుతున్నారు. అయితే, ఈరోజు పాదయాత్రలో జగన్ కు అనుకోని సంఘటన ఎదురైంది. విజయవాడకు చెందిన మురళీకృష్ణ అనే కార్యకర్త పాదయాత్రలో జగన్ ను కలిశాడు. తాను, తన తండ్రి టీడీపీ కార్యకర్తలమని, ఆ పార్టీ జెండాలు కట్టామని తెలిపారు. కానీ, చదువుకున్న తనకు టీడీపీ నేతలు బతుకుదెరువు చూపిస్తానని మోసం చేశారని వాపోయాడు. ఉద్యోగం అడిగితే రూ.3 లక్షలు ఇస్తే మున్సిపల్ కార్యాలయం లేదా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామంటున్నారని, కానీ, తనకు అంత స్తోమత లేదని చెప్పారు. దీంతో భీమవరం వచ్చి జ్యూస్ షాపులో పనిచేస్తున్నానని, టీడీపీని నమ్మి మోసపోయామని తెలిపారు. దీంతో ఆగని మురళీకృష్ణ టీడీపీ సభ్యత్వ కార్డును జగన్ ముందే చించేశాడు. అయితే, ధైర్యంగా ఉండాలని, త్వరలోనే మంచి రోజులొస్తాయని జగన్ మురళీకృష్ణకు నచ్చజెప్పారు.