మాకు పాన్ షాపులు, పంచర్ షాపులే మిగిలాయి
విభజన హామీల్లో తెలంగాణకు సంబంధించిన హామీలు కూడా అమలు కాలేదని, అమలు కానప్పుడు చట్టం చేయడం ఎందుకని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు ప్రశ్నించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ సమస్యలు ఉన్నాయన్నారు. కానీ, తెలంగాణపై ఎవరూ ఎందుకు సానుభూతి చూపడం లేదో అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్ లో బహుళ అంతస్థుల భవనాలు, మాల్స్ తెలంగాణ వారివి లేవని, కేవలం పాన్ షాపులు, సైకిల్ పంచర్ షాపుల లాంటివి మాత్రమే తెలంగాణ వారివి అన్నారు. 60 ఏళ్లుగా జరుగుతున్నది ఇదేనన్నారు. ఒక్క ఆర్డినెన్సుతో సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్ర లో కలిపేసినా ఏమీ అనలేదన్నారు. రాష్ట్ర విభజన బిల్లు కచ్చితంగా శాస్త్రీయంగా, ప్రజాస్వామికబద్ధంగా పాస్ అయ్యిందని, తరచూ బిల్లుపై మాట్లాడవద్దని కోరారు. తెలంగాణకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇబ్బంది కలగనంత వరకు ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.