మోడీని ఓడించేందుకు ఆ దేశాలు ప్రయత్నిస్తున్నాయా..?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా ప్రతిపక్షాలతో పాటు కొన్ని విదేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయంటున్నారు బీజేపీ నేతలు. కర్ణాటకకు చెందిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మల్యే సీ.టీ.రవి ఇటువంటి ప్రకటనే చేశారు. ఇప్పటికే నరేంద్ర మోడీకి భయపడి రానున్న ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలవకుండా సైద్ధాంతిక విభేదాలు మరిచి ప్రతిపక్ష పార్టీలు ఒక్కటవుతున్నాయని ఆయన అన్నారు. ఈ పార్టీలతో పాటు పాకిస్థాన్, చైనా వంటి దేశాలు కూడా మరోసారి మోడీ అధికారం చేపట్టకుండా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. నరేంద్ర మోడీ మరోసారి అధికారం చేపడితే భారతదేశం మరింత బలంగా తయరవుతుందని, అభివృద్ధి చెందుతుందనే భయంతోనే ఆయా దేశాలు మోడీ అధికారంలోకి రాకుండా ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక కర్ణాటకలో ఓటమికి బి-ఫ్యాక్టర్ కారణమని చెప్పిన ఆయన, బెంగళూరు, బిజాపూర్, బళ్లారి, బెలగావ్, బీదర్ ప్రాంతాల్లో తక్కువ సీట్లు వచ్చాయని ఉదహరించారు.