జగన్ ఊపిరి కూడా పీల్చుకోలేరు....!
తన జీవితం తెరిచిన పుస్తకమని, ఎటువంటి దాపరికాలు లేవని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడగలనని, ఫ్యాక్షనిస్టులకు బయపడే వ్యక్తినికానని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ... ఎవరూ ఆకాశం నుంచి దిగిరాలేదని, యూనివర్సిటీలో ఎవరు ఏం చేశారో తనకు తెలుసన్నారు. ఎదుటి వారు ఉపిరి పీల్చుకోలేనంత, తట్టుకోలేనంతగా విమర్శలు చేయగలనని ఆయన పరోక్షంగా జగన్ పై స్పందించారు.. అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోతున్నారని జగన్ ను అడిగానని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అనుభవం లేనందునే పోటీ చేయలేదని, ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదని, ఒకవేళ పంచాయితీ ఎన్నికలు పెట్టినా పోటీ చేస్తామని తెలిపారు. గురుపౌర్ణమి రోజునే రాష్ట్రాన్ని జనసేన పార్టీ కైవసం చేసుకునేందుకు బీజం పడిందని ఆయన ప్రకటించారు.