అక్కడ ఎన్నికలకు పేకాటే ఎజెండా?
పేకాట ఆడాలా? వద్దా? పేకాట క్లబ్బులను ప్రోత్సహించాలా వద్దా? పేకాట అనేది మన ప్రాంత సంస్కృతిగా చెలామణీలో ఉండాలా వద్దా? .. ఈ పాయింట్లే ఇప్పుడు ఎన్నికలలో ఓట్లను రాబ్టటడానికి పార్టీలకు ఎజెండా అంశాలుగా ఉన్నాయి. మన దేశంలో గోవా రాష్ట్రం కాస్మొపాలిటన్ కల్చర్ తో అలరారుతూ ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు. అక్కడ లిక్కర్ ఎంత విచ్చలవిడిగా ఉంటుందో.. కాసినోలు, పేకాట క్లబ్బులు అంతే సాధారణంగా ఉంటుంటాయి. అయితే.. ప్రస్తుతం రాబోతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బలాన్ని బాగా పెంచుకోవాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం గోవాలో కేసినోలకు వ్యతిరేకంగా ఉద్యమించే ప్రయత్నంలో అలాంటి ఎజెండాతో వెళుతున్నట్లుంది.
గోవా రాష్ట్రానికి కేసినోలు యూఎస్పీగా ఉండడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. అంటూ ఆప్ ఇక్కడ ప్రచారం చేస్తోంది. ఈసారి ఎన్నికల్లో కేసినోలు అనేవి ఒకానొక కీలక ప్రచారాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఈ కేసినోలను వ్యతిరేకిస్తున్న ఆప్ నాయకుడు ఆస్కార్ రెబెలో.. కేసినోల లాబీ నుంచి తమ పార్టీకి ఎలాంటి విరాళాలు స్వీకరించబోయేది లేదని కూడా సెలవిస్తున్నారు. కేసినోల వల్లనే మాదకద్రవ్యాలు, వ్యభిచారం అన్నీ విచ్చలవిడిగా అయిపోయాయి.. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలంటే.. ప్రజలంతా మాకు పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆప్ కోరుతోంది.
గతంలో భాజపా ఎన్నికలకు ముందు కేసినోలనించి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తామని ప్రకటించింది. అయితే సంకీర్ణ సర్కారుగా అధికారంలోకి రాగానే.. కేసినోలు ప్రధాన ఆదాయ వనరు అనే నెపంతో ఆ హామీని పక్కన పెట్టింది. మరి ఇప్పుడు ఆప్ అలాంటి వాగ్దానాలే చేస్తోంది. ఎన్నికల గమనాన్ని ఈ కేసినోల ప్రపంచం ఎలా శాసించబోతుందో చూడాలి.