నల్లధనంపై యుద్ధం : 500, 1000 నోట్ల రద్దు
ప్రధాని నరేంద్రమోదీ నల్లధనంపై యుద్ధం ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. ఇవాళ (మంగళవారం) అర్ధరాత్రి నుంచి ఈ రెండు డినామినేషన్లలో నోట్ల ముద్రణ జరగదని మోదీ ప్రకటించారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీ ఈ కీలక అంశాన్ని వెల్లడించారు.
నల్లధనం నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం అని వెల్లడించిన ప్రధాని నరేంద్రమోదీ.. ఆ దిశగా అనేక అంశాలను ప్రకటించారు. ప్రజల వద్ద ఉండే 1000, 500 రూపాయల నోట్లను డిసెంబరు 31 వ తేదీలోగా బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేయాల్సి ఉంటుందని మోదీ వెల్లడించారు. పైగా బ్యాంకుల్లో ఈ నోట్లను జమ చేసేప్పుడు విధిగా తమ ఐడీ కార్డు కూడా చూపించాల్సి ఉంటుంది. ఇలా నోట్లు జమ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఎలాంటి చార్జీలు ఉండవని ప్రకటించారు. బుధ, గురు వారాల్లో ఏటీ ఎంలు బంద్ చేస్తున్ట్నట్లుగా ప్రకటించారు. నవంబరు 11 వరకు పెట్రోలు బంకులు, రైల్వే టికెట్ల కొనుగోలుకు ఈ నోట్లు వాడవచ్చునని ప్రకటించారు.
కొత్త నిబంధనల ప్రకారం ఒక రోజుకు పదివేల రూపాయల కంటె ఎక్కువ సొమ్ము విత్ డ్రా చేయడానికి వీల్లేదు. అలాగే.. వారానికి 20 వేల రూపాయలకంటె ఎక్కువ విత్ డ్రా చేయడానికి కూడా వీల్లేదు. నల్లధనం కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటాం అని మోదీ ప్రకటించారు. త్వరలోనే కొత్త 500 నోట్లు, 2000 రూపాయల నోట్లు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పారు.