నోటుపై వేటు : చంద్రబాబు , రామోజీ హర్షం!
నల్లధనం కట్టడి చేసే చర్యల్లో భాగంగా 500, 1000 రూపాయల నోట్లను నిషేధిస్తూ ప్రధాని మోదీ ప్రకటించిన నిర్ణయం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశంలో నల్లధనం రూపుమాసిపోవడానికి దారితీస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు కొన్ని వారాల కిందట... 500 , 1000 రూపాయల నోట్లను నిషేధించాల్సిన ఆవశ్యకత గురించి ప్రధాని మోదీకి స్వయంగా తాను లేఖ రాసిన సంగతి తెలిసిందే. నల్లకుబేరులు స్వచ్ఛంద వెల్లడి పథకంలో వివరాలు వెల్లడించిన సమయంలో.. హైదరాబాదులో ఒకే వ్యక్తి పదివేల కోట్లు నల్లధనం చూపించారంటే.. ఆశ్చర్యం వెలిబుచ్చిన చంద్రబాబునాయుడు.. ఆ సమయంలోనే ఈ నోట్ల నిషేధం అవసరాన్ని గురించి కూడా మాట్లాడారు. ఆ తర్వాతి రోజునే ప్రధానికి లేఖ రాశారు. అయితే చంద్రబాబునాయుడు లేఖ కంటె ముందునుంచి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన కసరత్తులో ఉన్నట్లుగా మంగళవారం నాడు నిర్ణయం వెలువడింది.
ప్రధాని మోదీ ఈ నోట్ల నిషేధానికి సంబంధించి ముందుగా ఎలాంటి లీకులు ఏమాత్రం లేకుండా.. ఉన్నపళంగా నిర్ణయం ప్రకటించడం, తక్షణం నిర్ణయం అమల్లోకి వచ్చేలా ప్రకటించడం ద్వారా చాలా మందికి షాక్ ఇచ్చారనే చెప్పాలి. కేంద్రం ఇలాంటి ఆలోచనతో ఉన్నట్లుగా చిన్న పాటి పొడ బయటకు వచ్చి ఉన్నా సరే.. పై స్థాయిలో ఉండే నల్ల కుబేరులు ఎప్పుడో అప్రమత్తమైపోయి.. తమ వద్ద ఉన్న నోట్లు మొత్తం ఇతర డినామినేషన్లలోకి మార్చేసుకుని ఉండేవారనడంలో సందేహం లేదు. అలాంటి తప్పుడు మార్గాలకు ఆస్కారం లేకుండా మోదీ ఉన్నపళంగా నిర్ణయం ప్రకటించారు. అందరినీ దిగ్భ్రమకు గురిచేశారు.
రామోజీ ఎప్పట్నుంచో అంటున్నారు...
ప్రధాని మోదీ 500, 1000 నోట్లను నిషేధించడం పట్ల తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రామోజీరావు ఏడాదికంటె ఎక్కువ కాలం ముందు నుంచి.. ఈ అంశం మీద పోరాటం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఓ సందర్భంలో రామోజీ ఫిలింసిటీలో సెమినార్ నిర్వహించి.. 500, 1000 నోట్లను నిషేధిస్తే.. నల్లధనాన్ని కట్టడి చేయవచ్చుననే అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. మోదీ సర్కారు ఏర్పడిన తర్వాత కూడా తాను స్వయంగా లేఖలు కూడా రాశారు. దాదాపు ఏడాదికి పైగా రామోజీరావు ఈ అంశాన్ని తన ఎజెండాలో భాగంగా పెట్టుకునే ఉన్నారు. ఇన్నాళ్లకు గుట్టుచప్పుడు కాకుండా.. మోదీ నిర్ణయంతో దేశాన్ని నివ్వెర పరిచారు.