అవమానం…అనుమానం
కేవలం మూడు వేల కోట్ల రూపాయల రుణమంజూరుకు రాష్ట్రప్రభుత్వాన్ని జాతీయ బ్యాంకు అనుమానించిందంటే అవమానమే. ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు ఆర్థిక సంస్థకు అప్పు ఇచ్చేందుకు సవాలక్ష సందేహాలను ముందుకు [more]
కేవలం మూడు వేల కోట్ల రూపాయల రుణమంజూరుకు రాష్ట్రప్రభుత్వాన్ని జాతీయ బ్యాంకు అనుమానించిందంటే అవమానమే. ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు ఆర్థిక సంస్థకు అప్పు ఇచ్చేందుకు సవాలక్ష సందేహాలను ముందుకు [more]
కేవలం మూడు వేల కోట్ల రూపాయల రుణమంజూరుకు రాష్ట్రప్రభుత్వాన్ని జాతీయ బ్యాంకు అనుమానించిందంటే అవమానమే. ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు ఆర్థిక సంస్థకు అప్పు ఇచ్చేందుకు సవాలక్ష సందేహాలను ముందుకు తెచ్చింది స్టేట్ బ్యాంక్. ప్రభుత్వ గ్యారంటీని సైతం పక్కన పెట్టింది. ఇందులో కేవలం ఆర్థిక కోణాలే కాకుండా రాజకీయాంశాలు మిళితం కావడంతో చర్చ రచ్చకెక్కుతోంది. ఇంతటి దుస్థితి ఎందుకు ఏర్పడిందనేది ఒక ప్రశ్న. ఇందులో రాజకీయాల పాత్ర ఎంతనేది మరో ప్రశ్న. ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగసంస్థలు క్రమేపీ విశ్వసనీయతను కోల్పోతున్నాయా? అనేది ఇంకో పెద్ద విషయం. ఏదేమైనప్పటికీ ఆర్థిక సామర్థ్యం, ఆర్థిక నిర్వహణ, రాజకీయ విధానాల వంటి బహుముఖ అంశాలతో ముడిపడిన తాజా వివాదానికి పరిష్కారాలను వెంటనే అన్వేషించాల్సి ఉంది. లేకపోతే మరిన్ని ఆర్థిక సంస్థలు ఇదే రకమైన తిరకాసు మొదలుపెట్టే ప్రమాదం ఉంది.
అప్పు …నిప్పు…
రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ఠ దిగజారడానికి కారణాలేమిటంటే దోషులుగా తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు రెంటిదీ సమ బాధ్యతే. టీడీపీ ఇబ్బడిముబ్బడిగా అప్పులను దూసి తెచ్చింది. అప్పు చేసి పప్పుకూడు సామెతను గుర్తు చేస్తూ దొరికిన చోటల్లా నిధులను సమీకరించి రోజువారీ నిర్వహణకు వెచ్చించింది. దాని పర్యవసానం ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలను వెంటాడుతోంది. ప్రభుత్వం నేరుగా రుణాలు మంజూరు చేయకుండా కార్పొరేషన్లను రుణాల ఊబిలోకి దింపేసింది. ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీలు సర్దుబాటు చేయకుండా ఏటేటా మరింత అప్పుల్లోకి సంస్థలు దిగజారడానికి ఒక రకంగా ప్రభుత్వాలే కారణమవుతున్నాయి. ద్రవ్యక్రమశిక్షణకు సంబంధించి చట్టపరమైన నిబంధనలకు దొరకకుండా కార్పొరేషన్లను ముందు పెట్టి ప్రభుత్వాలు రుణాలు దూసి తెస్తున్నాయి.
సంక్షోభంలో కూరుకుపోయి…..
ఆయా సంస్థల ఆస్తులకు, అప్పులకు పొంతన కుదరడం లేదు. నిండా సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ప్రస్తుతం అప్పు అడిగిన విద్యుత్ ఆర్థిక సంస్థ రెండేళ్ల కాలంలోనే మూడు రెట్లు రుణాల ఊబిలో కూరుకుంది. దీనినుంచి గట్టెక్కించే ప్రయత్నం సాగ లేదు. అప్పులను దీర్ఘకాలిక అభివృద్ధికి పెట్టుబడి వనరుగా చూడటం లేదు. తాత్కాలిక నిర్వహణకు అత్యవసర ముడిసరుకుగా వాడుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఆయా సంస్థల ఆదాయాన్ని పెంచడానికంటే రాజకీయంగా ఆయా సంస్థలను వినియోగించు కోవడంపైనే మొగ్గు చూపుతున్నాయి. ఇదే బ్యాంకులను ఆలోచింపచేస్తోంది. ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టానికి దొరకకుండా రాష్ట్రాలు అనుసరిస్తున్న పంథా బ్యాంకులకు సవాల్ విసురుతోంది.
కేంద్రం కొరడా…
బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు పూనిక వహిస్తున్నాయి. వాణిజ్య పరంగా బ్యాంకులను పరిపుష్టం చేయాలనే దిశలో అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రధానంగా బ్యాంకులను విలీనం చేయడం ద్వారా పెద్ద బ్యాంకులుగా తీర్చిదిద్దుతున్నారు. దీనివల్ల ఆయా బ్యాంకుల ఆర్థిక సామర్థ్యం పెరుగుతుంది. సంస్కరణలకు వీలవుతుంది. అదే సమయంలో నిబంధనల విషయంలో సాధికారత సాధించేందుకు దోహదం చేస్తుంది. అందుకే ఉద్యోగ సంఘాల నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ కేంద్రం ముందుకే వెళుతోంది. రుణ మంజూరులో జాగ్రత్తలు, నిరర్థక ఆస్తులను తగ్గించడం, లాభదాయకత పెంచడం వంటి విషయాల్లో కఠినంగా ఉండాలని కేంద్రం బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చినప్పుడు తాజాగా బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకుంటున్న జాగ్రత్తలే రుణమంజూరుకు గుదిబండలుగా మారాయి. రుణం విషయంలో ఆచితూచి వ్యవహరించే క్రమంలో భాగంగానే కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో రెండు ప్రశ్నలు పాత టీడీపీ ప్రభుత్వానికి సంబంధించినవి. మరో రెండు విషయాలు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినవి.
రాజకీయ ప్రభావం…
గతంలో అప్పు తీసుకున్న నిధులను ఏవిధంగా వెచ్చించారు? అసలు సంస్థకు అప్పు తీర్చగల సామర్థ్యం ఉందా? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడం అంత సులభం కాదు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీని మరో ప్రభుత్వం వస్తే గౌరవిస్తుందన్న గ్యారంటీ ఏమిటన్నది మరో కీలకమైన పొలిటికల్ ప్రశ్న. ఇది నేరుగా వైసీపీ సర్కారుకు గురిపెట్టిన బాణమే. పార్టీలు ఏవైనప్పటికీ ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉండే ప్రక్రియ. గత టీడీపీ సర్కారుపై సందేహాలతో అన్నిటినీ పక్కనపెడుతోంది వైసీపీ ప్రభుత్వం . ఇది సర్కారు ప్రతిష్టను మసకబారుస్తోంది. ముందుగా పూర్తిస్థాయిలో లోపాలపై అధ్యయనం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత విచారణ కమిటీలను నియమించడమనేది రివర్స్ పాలసీగానే చెప్పుకోవాలి. విధానపరమైన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తమ ఆదేశాలు, ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరించే రాష్ట్రప్రభుత్వాలకు పగ్గాలు వేయాలనే దిశలో పావులు కదుపుతోంది. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు పెట్టిన అయిదు వేల కోట్ల రూపాయల నిధుల విడుదలను కేంద్రం పక్కనపెట్టింది. రకరకాల రూపాల్లో అరవై వేల కోట్లరూపాయలు మంజూరు చేయాలంటూ రాష్ట్రప్రభుత్వం అందచేసిన వినతిపత్రంపై కనీసం అధ్యయనం చేయడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే రాజకీయ ప్రయోజనాల కోణంలో ఆర్థిక దిగ్బంధనం కొనసాగుతోందా? అనే ప్రశ్నలను కొందరు పరిశీలకులు లేవనెత్తుతున్నారు. అనుమానాస్పదంగా మారిన ఆర్థిక రాజకీయ నిర్వహణ మరింత లోతుగా విస్తరించకముందే మేలుకోవడం మంచిది.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- ycp